NTV Telugu Site icon

Himachal Pradesh CM: పాలమ్మే స్థాయి నుంచి పాలించే స్థాయికి.. హిమాచల్ నూతన సీఎం విజయ ప్రస్థానం

Himachal Pradesh Cm

Himachal Pradesh Cm

Himachal Pradesh CM: సుఖ్వీందర్ సింగ్‌ది మొదట్లో సాధారణ జీవనమే. ఆయన తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు కూడా ఒకప్పుడు పాలు విక్రయించారు. పాలు విక్రయించిన సుఖ్వీందర్‌.. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. రాష్ట్రానికి ఏడో సీఎంగా పాలన అందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సింగ్ సుఖు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్‌ పార్టీ శనివారం ప్రకటించింది. ఆయన గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సుఖ్వీందర్ సింగ్ సుఖు హమీర్‌పూర్‌ జిల్లా నాదౌన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండగా.. డిప్యూటీ సీఎంగా ముకేశ్‌ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నేతగా సుఖ్వీందర్ సుఖును ఎన్నుకొన్నారు.

అంతకుముందు శుక్రవారం సాయంత్రం రాష్ర్టానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని ఆ పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్‌ప్రదేశ్‌ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి పీఠం పోటీలో మొన్నటిదాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ముకేశ్‌ అగ్నిహోత్రి, సుఖు, సీనియర్‌ నేత హర్షవర్ధన్‌ చౌహాన్‌, ప్రతిభాసింగ్‌ నిలిచారు. అయితే, అధిష్ఠానం సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరునే ఫైనల్‌ చేసింది. మొత్తం 68 సీట్లకు గానూ కాంగ్రెస్‌ 40 సీట్లు గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకొన్నది. ఆదివారం నాటి ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.

Ink Attack on Minister: అంబేడ్కర్‌, పూలేపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిపై సిరా దాడి

వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు.. సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీలో చదువుతూ సామాజిక కార్యకర్తగా ఎదిగారు. 1980ల్లో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా స్టేట్‌ చీఫ్‌ బాధ్యతలు చేపట్టారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక 2000ల్లో స్టేట్‌ కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడయ్యారు. 2003లో తొలిసారి మొదలు.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. 2019 నుంచి ప్రతిభాసింగ్‌ బాధ్యతలు చేపట్టే వరకు పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 58 ఏళ్ల సుఖుకు రాహుల్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.