Mohan Babu University: మోహన్బాబు యూనివర్సిటీ (MBU)లో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ తిరుపతిలో విద్యార్థి సంఘాలు భారీ నిరసనకు పిలుపునిచ్చాయి. ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. SFI నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. విద్యార్థి నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కిడ్నాప్ రాజకీయాలు పూర్తిగా నశించాలంటూ గళం విప్పాయి. మోహన్బాబు యూనివర్సిటీ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన విద్యార్థి సంఘాల నేతలు, MBUకి ఉన్న గుర్తింపును తక్షణమే రద్దు చేసి యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: Ranveer vs Ranbir: ధురంధర్ హిట్ను జీర్ణించుకోలేకపోతున్నారా?.. రణవీర్ యాక్టింగ్పై నెట్టింట రచ్చ!
ఈ నిరసనకు SFI, AISF, NSUI, PDSU సంఘాలు ఐక్యంగా మద్దతు ప్రకటించాయి. విద్యార్థి ఉద్యమాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ, ఐక్య కార్యాచరణతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ్టి నిరసనకు విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు భారీగా తరలిరావాలని విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం మరింత తీవ్రంగా కొనసాగుతుందని ప్రకటించారు. కాగా, మోహన్బాబు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి చెందిన ఇద్దరు నేతలను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించిన విషయం విదితమే..
ఇక, ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్కు గురైన విద్యార్థులను వెతికే చర్యలు చేపట్టారు. అనంతరం కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసి అడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్కు పాల్పడినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) BNS సెక్షన్ల కింద క్రైం నెంబర్ (Cr. No. 23/2026) కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో A1గా సతీష్, A2గా మోహన్ బాబు, A3గా మంచు విష్ణు బాబుపై కేసు నమోదు చేశారు. మొత్తంగా ప్రధాన నిందితులతో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేపడుతున్నారు.
