SL vs WI: వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లంక జట్టు 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సాంక 103 బంతుల్లో 79 పరుగులు చేసి ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశాడు. కెప్టెన్ కుసాల్ మెండిస్ 62 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. ఆ తర్వాత చరిత్ అసలంక 45 పరుగులతో కీలక సహకారం అందించగా, చివర్లో జనిత్ లియనాగే 29 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి జట్టు స్కోరును 300 దాటించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్ తలో రెండు వికెట్లు తీశారు.
304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్కు జస్టిన్ గ్రీవ్స్ మంచి ఆరంభం అందించాడు. అతడు 38 బంతుల్లో 45 పరుగులు చేయగా, కెప్టెన్ షాయ్ హోప్ కూడా బాధ్యతాయుతంగా ఆడుతూ 66 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో వెస్టిండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కీసీ కార్టీ 27, రోస్టన్ చేజ్ 33, గుడకేష్ మోటి 22 పరుగులు చేసినా జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయారు. చివర్లో షమర్ జోసెఫ్ 23 పరుగులతో పోరాడినప్పటికీ వెస్టిండీస్ 49.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక విజయంలో పేసర్ దుశ్మంత చమీరా కీలక పాత్ర పోషించాడు. చమీరా 4 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటింగ్ను నేలకూల్చాడు. అతనితో పాటు స్పిన్నర్ మహీష్ తీక్షణ రెండు వికెట్లు తీయగా.. వనిందు హసరంగా, చరిత్ అసలంక తలో వికెట్ తీసి మ్యాచ్ను శ్రీలంక వైపు తిప్పేశారు. బ్యాటింగ్లో కీలక సమయంలో 72 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించిన శ్రీలంక కెప్టెన్ కుసాల్ మెండిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
