Corona New Variant: ఐదేళ్ల కిందట కరోనా సృష్టించిన విలయ తాండవం గుర్తుకొస్తే వళ్లు జలదరిస్తుంది. నాటి పరిస్థితులు తలుచుకుంటే వెన్నులో వణుకుపుడుతోంది.మహమ్మారి కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది.లక్షలాది మంది ప్రాణాలు తీసింది.కోట్లాది మందిని ఆసుపత్రి పాల్జేసింది. ఏ హాస్పిటల్ చూసినా కరోనా పేషెంట్లతో నిండిపోయింది. బెడ్లు లేక, ఆక్సిజన్ అందాక ఎంతోమంది అల్లాడారు. కల్లోల కోవిడ్ ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చింది. అలాంటి మాయదారి కరోనా వదల బొమ్మాళి అంటూ మళ్లీ కోరలు చాస్తోంది. సైలెంట్గా విస్తరిస్తూ బుసలు కొడుతోంది. నిను వీడని నీడనంటూ వెంటాడుతోంది. మూడేళ్ల విరామం తర్వాత దేశంలో జెట్ స్పీడ్తో వ్యాపిస్తూ టెన్షన్ పెడుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజుల వ్యవధిలోనే 250పైగా కేసులు రికార్డయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోకి కొవిడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. పాజిటివ్ కేసులతో పరేషాన్ చేస్తోంది.
తెలంగాణలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కొవిడ్ కేసు నమోదైంది. ఓ డాక్టర్కు పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నఅతనికి ఆర్టిపిసిఆర్ పరీక్ష నిర్వహించగా.. ఫలితం పాజిటివ్గా వచ్చింది. ప్రస్తుతం ఆ వైద్యుడిని క్వారంటైన్లో ఉంచారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్యాధికారులు భరోసా ఇస్తూనే.. అలెర్ట్గా ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకొని స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
హైదరాబాద్లో కొవిడ్ కేసుతో గాంధీ ఆసుపత్రి అప్రమత్తమైంది.ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా, 35 పడకలతో కూడిన ప్రత్యేక కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో సుమారు 60 శాతం వరకు ఈ వైరస్ వల్లే సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎటువంటి భయం పెట్టుకోవద్దని, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని గాంధీ ఆసుపత్రి వైద్యులు భరోసా ఇచ్చారు. అయినా కూడా.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించడం అత్యవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్ చాలా మైల్డ్ లక్షణాలతో వస్తుందని..కంగారుపడాల్సిన అవసరం లేదంటున్నారు.
అటు ఏపీలో కరోనా కేసులు వణికిస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో కరోనా కేసు నమోదు కాగా తాజాగా కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్లో చేరింది.విశాఖ జిల్లా మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో 4 రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు.. అనుమానంతో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అని పాజిటివ్ అని కన్ఫామ్ అయింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లోనూ పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.
విశాఖ,కడపల్లో పాజిటివ్ కేసులతో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని,రద్దీ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచనలు చేసింది. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించంది. ఆరోగ్యశాఖకు చెందిన 24 గంటలు పని చేసే ల్యాబ్ల్లో మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని ఆదేశించింది. కొవిడ్ కేసులు పై రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ సమీక్ష జరిపారు. కొవిడ్ కేసులు ఎదుర్కొనేందుకు అందర్నీ అప్రమత్తం చేస్తున్నామమని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
విమ్స్, కేజీహెచ్లో 20 ఐసొలేషన్ బెడ్లు ఏర్పాటుచేశామన్నారు ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు. PPE కిట్స్, కొవిడ్ మందులను అందుబాటులో ఉంచామన్నారు. కరోనా విజృంభించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. విశాఖలో కోవిడ్ కేసు నమోదవడంతో కాకినాడ జీజీహెచ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. 24 బెడ్లతో కరోనా వార్డు, ఓ ఐసోలేషన్ను ఏర్పాటు చేశారు. మాస్క్ తప్పనిసరి చేశారు . కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.ప్రయాణాల్లోనూ, జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సూచించారు.కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని లేదాశానిటైజర్ ని వాడాలని సూచించారు.
నాలుగేళ్ల కిందట ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్ 19 ఆసియా దేశాల్ని షేక్ చేస్తోంది.డైలీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరగడం దడ పుట్టిస్తోంది.ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో ఆందోళన పడాల్సిన పనే లేదు.కానీ ప్రస్తుతం మన దేశంలో 250కి పైగా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలోలాగే కొవిడ్ కేసుల్లో కేరళ తొలిస్థానంలో ఉంది. అందరూ అలెర్ట్ గా ఉండాలని, ఎటువంటి పరిస్థితికైనా సిద్ధమవ్వాలని కేరళ ఆరోగ్య మంత్రి వార్నింగ్ ఇచ్చారు. వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ లు అలర్టయ్యాయి.