Site icon NTV Telugu

Tragedy: పని ఒత్తిడికి మరో ప్రాణం బలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆ*త్మహ*త్య..

Software

Software

ఐదంకెల జీతాలు, వీకెండ్ పార్టీలు, ఫారిన్ ట్రిప్పులు సాఫ్ట్ వేర్ అనగానే గుర్తొచ్చేది ఇవే. కానీ, లోలోపల పని ఒత్తిడికి గురవుతూ క్షణ క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ బ్రతుకుతున్నవారెందరో. అందులో కొందరు ఒత్తిడిని జయిస్తుండగా మరికొందరు మాత్రం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో భార్యా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Also Read:Srisailam Temple Ghee Controversy: శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా..? కొత్త అనుమానాలు

ఏపీలోని అనంతపురం తిలకుప్ప ప్రాంతానికి చెందిన సతీష్‌ (31) గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం రవళితో అతనికి వివాహం జరిగింది. స్వామినాయుడు, శ్రీదేవి దంపతుల మొదటి కుమారుడు సతీష్. తన సోదరుడితో కలిసి మియాపూర్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో సతీష్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. సతీష్‌ భార్య ఇటీవల సంక్రాంతికి సొంతూరు వెళ్లారు. ఈ క్రమంలో తన గదిలోకి వెళ్లిన సతీష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read:Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?

సతీష్ ఎంతకూ బయటికి రాకపోవడంతో సోదరుడు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే చీరతో ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్‌ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి తట్టుకోలేకే సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

Exit mobile version