భారతీయ సినీ పరిశ్రమలో కొందరు నటీనటులు తమ నటనతో గుర్తింపు తెచ్చుకుంటే, మరికొందరు తమ రూపంతో రాత్రికి రాత్రే సెన్సేషన్ అవుతుంటారు. సరిగ్గా 2005లో ‘లక్కీ: నో టైమ్ ఫర్ లవ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్ విషయంలోనూ ఇదే జరిగింది. అచ్చం ఐశ్వర్య రాయ్లా ఉండటంతో దేశమంతా ఆమె వైపు చూసింది. అయితే, అదే పోలిక ఆమె సొంత గుర్తింపును దెబ్బతీస్తుందని అప్పట్లో స్నేహా చాలా భయపడింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్ను కలిసినప్పుడు తను ఎంతలా టెన్షన్ పడిందో స్నేహా గుర్తు చేసుకుంది.
‘నన్ను ఐశ్వర్య రాయ్తో పోల్చడం వల్ల ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అని భయపడి.. ఆమెను కలిసినప్పుడు ‘సారీ, నన్ను ద్వేషించకండి’ అని కోరాను. కానీ ఐశ్వర్య చాలా హుందాగా నన్ను బాలీవుడ్ కుటుంబంలోకి ఆహ్వానించింది’ అని స్నేహా నాటి జ్ఞాపకాలను పంచుకుంది. బాలీవుడ్లో పోలికల గోల ఎక్కువవడంతో టాలీవుడ్కు షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఇక్కడ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, బాలయ్య సరసన ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
కానీ, కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’ అనే వ్యాధి ఆమెను సినిమాలకు దూరం చేసింది. తీవ్రమైన నీరసం వల్ల షూటింగ్లలో పాల్గొనడం కష్టమవ్వడంతో దాదాపు నాలుగేళ్ల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత 2020లో ఓటీటీలోకి అడుగుపెట్టిన స్నేహా, తాజాగా 2026లో తెలుగులో ‘నీలకంఠ’ అనే సినిమాతో మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ను ప్లాన్ చేసుకుంటోంది.
