Smriti Mandhana and Palash Muchhal Reunite: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఆ వీడియోలో పలాష్ ముచ్చల్ సోదరి పలక్ ముచ్చల్, ఆమె భర్త మిథున్తో కలిసి స్మృతి మంధాన తండ్రితో కనిపించడం గమనార్హం. ముంబైలోని ఒక రెస్టారెంట్ బయట ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియోలో పలక్.. స్మృతి తండ్రికి నమస్కారం చేయగా, ఆయన ఆమెను ఆశీర్వదించడం కనిపిస్తుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు సవ్యంగానే ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.
గతంలో 2025 నవంబర్లో స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే, పెళ్లికి ముందు రోజు రాత్రే ఈ సంబంధం విరిగిపోయింది. పలాష్ ముచ్చల్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వివాహం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను పలాష్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోతో ఇద్దరూ మళ్లీ కలవబోతున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కొందరు అభిమానులు ఈ జంట మళ్లీ ఒక్కటవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఈ వీడియో పాతదా లేక తాజాదా అన్నది అధికారికంగా ధృవీకరించబడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇది సంచలనం సృష్టిస్తోంది. స్మృతి మంధాన ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత ఆసక్తిని పెంచుతోంది.
*