NTV Telugu Site icon

Suryakumar Yadav: నేను వేసిన చివరి ఓవర్‌ మ్యాజిక్‌ కంటే.. మా కుర్రాళ్ల ఆటే ఆకర్షించింది: సూర్య

Suryakumar Yadav Speech

Suryakumar Yadav Speech

Suryakumar Yadav Heap Praise on India Batters: తాను వేసిన చివరి ఓవర్‌ మ్యాజిక్‌ కంటే.. కుర్రాళ్లు ఆడిన ఆటతీరే బాగా ఆకర్షించిందని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. 200లకు పైగా స్కోర్లు చేసి విజయం సాధిస్తే ఎలా సంబరపడతామో.. 70 పరుగులకే సగం వికెట్లను కోల్పోయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆటను ఆస్వాదించాలన్నాడు. తాను కేవలం కెప్టెన్‌గా ఉండటానికి రాలేదని, నాయకుడిగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పాడు. మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంలో సూర్య కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ… ‘చివరి ఓవర్‌ మ్యాజిక్‌ కంటే మా కుర్రాళ్లు బ్యాటింగ్ చేసిన ఆటతీరే నన్ను ఆకర్షించింది. బ్యాటింగ్‌లో 30/4, 48/5 స్కోరు సమయంలో మా కుర్రాళ్లు బాగా ఆడడంతో ప్రత్యర్థిపై పోరాడే అవకాశం మాముందుంది. ఈ పిచ్‌పై 140 పరుగులను కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదు. మేము ఫీల్డింగ్ చేసే సమయంలో మా ప్లేయర్స్‌కు ఒకటే చెప్పా. గంటన్నరలో చివరి నిమిషం వరకూ మనస్సును నిమగ్నం చేస్తే విజయం సాధించవచ్చని చెప్పాను. 200+ స్కోర్లు చేసి విజయం సాధిస్తే ఎలా సంబరపడతామో.. 70 పరుగులకే సగం వికెట్లను కోల్పోయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆటను ఆస్వాదించాలి. అప్పుడే జీవితం సమతూకంగా అనిపిస్తుంది’ అని అన్నాడు.

Also Read: Paris Olympics 2024: బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లింది.. ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌ అయింది!

‘మా యువ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. దీంతో నా పని తేలికైంది. గ్రౌండ్‌లో, డ్రెస్సింగ్‌ రూమ్‌లో పాజిటివ్‌ దృక్పథం ఉంది. గత మ్యాచ్‌కు ముందే కొందరికి విశ్రాంతి ఇస్తామని చెప్పాం. అందరికీ అవకాశం రావాలంటే అలా చేయాల్సిందే. సహచరుల కోసం ప్రతి ఒక్కరూ తమ స్థానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎప్పుడూ బ్యాటింగ్‌కు వెళ్లినా కాస్త ఒత్తిడిగా భావిస్తా. ఒక్కసారి కుదురుకుంటే.. ఆటను ఆస్వాదిస్తా. నేను కేవలం కెప్టెన్‌గా ఉండటానికి రాలేదు, నాయకుడిగా ఉండాలనేదే నా కోరిక. సహచర ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తుంటా’ అని సూర్యకుమార్‌ చెప్పుకొచ్చాడు.