NTV Telugu Site icon

Singur Project Gates Lifted: నిండుకుండలా సింగూరు.. రెండు గేట్లు ఎత్తివేత

Singur

Singur

Singur Project Gates Lifted: వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు 4,6 నంబర్ల రెండు గేట్లను 1.50 మీటర్ల పైకెత్తి 16284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

Read Also: Hyderabad Mayor: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదు..

ప్రస్తుతం ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో జెన్ కో ద్వారా 2822 క్యూసెక్కులు, రెండు గేట్ల ద్వారా 16284 క్యూసెక్కుల నీటిని మొత్తం 19106 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సింగూర్ ప్రాజెక్టు నిండడం వల్ల ఆయకట్టు రైతాంగానికి రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకొని జలకళ సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండలా మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.