NTV Telugu Site icon

silos in lands; భూముల్లో గోతులు… ఆందోళనలో రైతులు

Lands Kdp

Lands Kdp

ఉన్న‌ట్టుండి పొలాల్లో ప‌డుతున్న పెద్ద పెద్ద గొయ్య‌లు క‌డ‌ప జిల్లాలో రైతుల‌ను బెంబేలెత్తిస్తున్నాయి. చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లంలోని రుద్రయ్య‌గారిప‌ల్లెలో ప‌సుపు పొలంలో ప‌డ్డ గొయ్య గ‌తేడాది లాగా వ‌రుస‌గా భూమి కుంగిపోతుందా అన్నంతగా జనం హ‌డ‌లిపోతున్నారు. ఒక గొయ్యి పూడ్చడానికి మూడు నుంచి నాలుగు ల‌క్ష‌లు ఖ‌ర్చ‌ల‌వుతుంద‌ని రైతులు ల‌బోదిబోమంటున్నారు. కడప శివారు గ్రామాల్లో మళ్లీ రైతుల్లో గ‌తేడాది భ‌యాందోళ‌న‌లే వ్య‌క్తం అవుతున్నాయి. ఉన్న‌ట్టుండి భూమి కుంగిపోవ‌డం, పెద్ద గొయ్యి పంట‌పొలాల్లో ఏర్ప‌డ‌టం రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అకస్మాత్తుగా ఏర్పడుతున్న లోతైన గొయ్యిపుడి, భూమిపై ఉన్న చెట్లు, ఇళ్లు, బావులు లోప‌లికి వెళ్ళిపోతున్నాయి. తాజాగా చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లం రుద్ర‌య్యాగారిప‌ల్లెలో ఇలాంటి గొయ్యే ఒక‌టి ప‌డింది. గ్రామంలోని తుమ్మల విష్ణు వర్ధన్ రెడీకి చెందిన సర్వే నెంబర్ 7/2 లొ 15 అడుగుల వెడ‌ల్పు, 20 అడుగుల లోతు తో పెద్ద గొయ్య‌ప‌డింది. అందులోనుంచి నీరు ఊరుతోంది. ఈగొయ్య‌కి ద‌గ్గ‌ర్లోనే వంక కూడా ఉంది. అయితే ప్ర‌స్తుతం అందులో నీటి ప్ర‌వాహం లేదు. గతంలో చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లం మామిళ్ళ ప‌ల్లె పంచాయితీ మాయ‌నోళ్ల‌ప‌ల్లెలో పాఠశాల‌లోని వాట‌ర్ ట్యాంక్ ఇలాగే భూమి కుంగి లోనికి వెళ్ళిపోయింది. దీంతో పాఠ‌శాల‌ల‌ను మార్చివేశారు.

ఎనిమిదేళ్ల క్రితం 2014 నవంబర్ లో మొదటగా అగ్రహారం సమీపంలోని బుగ్గలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలోని వాగు వద్ద ఒకేరోజు పదుల సంఖ్యలో పెద్ద పెద్ద గుంతలుగా భూమి కుంగిపోయింది. తరువాత ఇవి విస్తరిస్తూ నాయనోరిపల్లె, పెద్ద ముసల్ రెడ్డి పల్లె, గూడవాండ్ల పల్లె గ్రామాలకు విస్తరించి నెల రోజుల వ్యవధిలో 50 కి పైగా భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం కావడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించడంతో ప్రభుత్వం స్పందిచింది భూమి కుంగిపోవడం, ఆకస్మికంగా ఏర్పడతున్న మార్పులపై భూగర్భ శాస్త్ర వేత్తలు, జియలాజికల్ సర్వే అఫ్ ఇండియా నిపుణుల బృందం తో పరీక్షలు చేయించింది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్ల అమ్మకం.. అమెరికా ఆమోదం

ప్రత్యేక నిపుణుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించి భూమి కుంగిన ప్రదేశాలను పరిశీలించింది కూడా. ఎగువన ఉన్న బుగ్గవంక ప్రాజెక్టులో నీరు చేరడం వల్ల అందులోని నీటి ఊటలు భూగర్భం ద్వారా భూమి పొరల్లోకి వెళ్లి డొల్లగా మారి గుంతలు ఏర్పడుతున్నట్లు నిపుణుల బృందం తేల్చింది. గ్రామంలోని నివాస ప్రాంతాలకు సమీపంలోని గుంతలను గట్టి మట్టి, కాంక్రీట్ మిశ్రమాలతో పూడ్చాలని సూచించడంతో పాటు గ్రామం సమీపంలో ప్రవహించే నీటి ప్రవాహాలను మళ్లించాలని కూడా సూచించింది. అయితే నిపుణులు సూచించిన ఏ పనినీ జిల్లా యంత్రాగం చేపట్టలేదు. దీంతో ఇప్పుడు తాజాగా భూమి కుంగి గుంతలు ఏర్పడటం మళ్లీ పునరావృతమైంది. బుగ్గ‌వంక ప‌రివాహ‌క ప్రాంతాల్లో ఇలాంటి గొయ్య‌లు ఏర్ప‌డే పరిస్థితి వ‌స్తుందా అన్న అనుమానాలు ఎక్కువ‌య్యాయి.

ఇప్ప‌డు రుద్ర‌య్యగారిప‌ల్లెలో ప‌డ్డ గొయ్య‌ను పూడ్చ‌డానికి క‌నీసం మూడు నుంచి నాలుగు ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతోంది. అంతంత‌మాత్ర‌మే ఉన్న రైతుల‌ల‌కు పొలాల్లో ప‌డ్డ గొయ్య‌ల‌ను పూడ్చుకోవ‌డం త‌ల‌కు మించిన భార‌మే అవుతుంది. ప్ర‌భుత్వ‌మే ఈ న‌ష్టాన్ని నివారించాల‌ని రైతులు కోరుతున్నారు. అయితే గ‌తేడాది లాగే ఇలా గొయ్య‌లు ప‌డ‌టం మొద‌లైతే ఎక్క‌డెక్క‌డ ప‌డ‌తాయో అన్న భ‌యం వారిని వెంటాడుతోంది. జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ గొయ్యలు ప‌డే ప‌రిస్థితిపై ప్ర‌త్యేక దృష్టిపెట్టి, న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్ల అమ్మకం.. అమెరికా ఆమోదం