Siddipet District: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ యువకుడిపై జరిగిన దాడి అతని ప్రాణాలు తీసింది. గ్రామానికి చెందిన శ్యామ్ చారి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం మహిళ భర్తకు తెలిసి కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఆ మహిళ భర్త విడాకులు తీసుకున్నాడు. అనంతరం మహిళ కుటుంబ సభ్యులు శ్యామ్పై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 26న జరిగిన ఘటనలో శ్యామ్ చారిని పట్టుకుని అతని కాళ్లు, చేతులు కట్టేసి కర్రలు, డ్రిప్ పైపులతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, వ్యక్తిగత విభేదాలు హింసాత్మక రూపం దాల్చి ఓ యువకుడి ప్రాణాలు బలితీసుకోవడం విషాదకరంగా మారింది.
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..

Siddipet Ramsagar