NTV Telugu Site icon

Medchal: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సై, సీఐ

Police

Police

Medchal: మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమికి సంబంధించి మరో వ్యక్తి భూ సమస్యపై గొడవలో భాగంగా రెవెన్యూ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులపై భరత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు.

Read Also: Kidnap: చిన్నారులను కిడ్నాప్‌ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు అరెస్ట్

అయితే ఇందులో ఓ కేసుకు సంబంధించి భరత్ రెడ్డిపై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిలు మూడు లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. అన్ని మాట్లాడుకున్న తర్వాత శుక్రవారం నాడు భరత్ రెడ్డి కుషాయిగూడలోని తన కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా మూడు లక్షలు రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామి, మధ్యవర్తి ఉపేందర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ తెలిపారు.