Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?

Shubman Gill

Shubman Gill

Shubman Gill Retires Hurt: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లక్ష్యఛేదనలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంతో ఆట మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. 75 బంతుల్లో 80 పరుగులు చేసిన గిల్ జట్టును విజయపథంలో నడిపిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇన్నింగ్స్ 24వ ఓవర్ సమయంలోనే గిల్ కుడి కాలు వద్ద కాస్త అసౌకర్యంగా ఫీలయ్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించారు. ఆ సమయంలో గిల్‌కు నీరు తాగించి, కుడి కాలి వెనుక భాగంలో స్ట్రెచింగ్ కూడా చేశారు. చికిత్స ఎక్కువసేపు కొనసాగడంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన ఆటను త్వరగా కొనసాగించాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత గిల్ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించినా, నొప్పి పూర్తిగా తగ్గలేదు.

శ్రేయస్ అయ్యర్‌తో కలిసి గిల్ మూడో వికెట్‌కు 101 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే కొద్దిసేపటికే మరోసారి అసౌకర్యానికి గురైన గిల్ తన గ్లౌజులు తొలగించి మైదానంలోనే కూర్చున్నాడు. కుడి కాలి వెనుక భాగాన్ని పట్టుకుని నొప్పితో ఇబ్బంది పడిన తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇది కండరాలు పట్టేయడం (క్రాంప్స్) వల్ల జరిగి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం.

లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. చూడచక్కని షాట్లతో స్కోర్‌బోర్డును ముందుకు నడిపిస్తూ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టును విజయం వైపు తీసుకెళ్లాడు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద రన్‌ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔటవడంతో భారత్‌పై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక దశలో 107/6తో కష్టాల్లో పడింది. అయితే జో రూట్, లియామ్ డాసన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకుని 258 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.