Shreyas Iyer Fined: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించిన ఆనందంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు (Slow Over-rate) గాను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ సీజన్ లో పంజాబ్ జట్టుకు ఇది రెండో ఓవర్ రేట్ నేరం కావడంతో శిక్ష తీవ్రత పెరిగింది.
IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్తో గుజరాత్ పోరు!
నిబంధనల ప్రకారం రెండోసారి ఈ తప్పు దొర్లడంతో కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా, ప్లేయింగ్ ఎలెవన్ లోని మిగిలిన ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్తో సహా) కూడా జరిమానా పడింది. వీరికి ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా విధించారు. పంజాబ్ జట్టు ఫీల్డింగ్ సమయంలో సమయాన్ని వృథా చేయడం వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ కమిటీ స్పష్టం చేసింది.
ఇది ఇలా ఉండగా.. పంజాబ్ కింగ్స్ యాజమాన్యాన్ని కలవరపెడుతున్న అంశం మరొకటి ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఈ సీజన్ లో పంజాబ్ జట్టు మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే గనుక.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్ లు మిగిలి ఉండడంతో, పంజాబ్ జట్టు క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఒక్క పొరపాటు జరిగినా కీలక సమయంలో కెప్టెన్ జట్టుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.
SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?
ఇక నిన్న జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 29 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ కానలీలు వారి సహకారం అందించారు. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ మ్హాత్రే (73) రాణించినప్పటికీ, పంజాబ్ బ్యాటింగ్ ధాటికి చెన్నై బౌలర్లు నిలవలేకపోయారు. వరుసగా రెండో విజయం అందుకున్న పంజాబ్, ఇప్పుడు ఓవర్ రేట్ విషయంలో కాస్త ఒత్తిడిలోకి వెళ్లింది.