Shiva Nirvana: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అయితే, తాము ఈ సోషల్ మీడియా విజ్ఞప్తుల కంటే ముందే ఈ సాంగ్ పెట్టాలని అనుకున్నామని తాజాగా దర్శకుడు చెప్పుకొచ్చారు.
అలాగే, ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సింగర్ డప్పు శీను వాయిస్లో ఏదో వెలితి కనిపిస్తోందని, ఒరిజినల్ వాయిస్ బేస్తో సరిపోలడం లేదని సోషల్ మీడియాలో కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయం మీద దర్శకుడిని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నిజానికి తాము ఈ సాంగ్ ఎవరితో పాడించాలా అని అనుకున్నప్పుడు చాలా పేర్లు వినిపించాయని, నేపథ్య గాయకుల పేర్లు కూడా పరిశీలించామని, కానీ డప్పు శ్రీను గారితోనే పాడిస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని భావించి ఆయనతోనే పాడించినట్లు చెప్పుకొచ్చారు. ఆయనను పిలిపించి హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో రికార్డింగ్ చేయించాక, తమకు కూడా అప్పటి వాయిస్ బేస్ ఎందుకో సరితూగలేదు అనిపించినట్లుగా ఆయన తెలిపారు.
ఒరిజినల్ సాంగ్ ఆయన పాడి దాదాపు 15 ఏళ్లకు పైగానే పూర్తయింది. అప్పటినుంచి ఆ పాటనే యూట్యూబ్లో మనమందరం వింటూ వచ్చాం. అప్పటి ఆయన వయసు వేరు, ఇప్పుడు పాడినప్పుడు ఆయన వయసు వేరు. కొంత బేస్ తగ్గిన మాట వాస్తవమే, కానీ ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని భావించి ఆ గౌరవం ఇచ్చాం. దీని మీద కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చు, కానీ ఇది ఒరిజినల్ సింగర్కి తాము ఇవ్వాలనుకున్న గౌరవం అని ఆయన చెప్పుకొచ్చారు.

