బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరిజన్ డెయిరీ కి చెందిన శేజల్ గురువారంనాడు న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ మీద పదవుల మీద ఉన్న వ్యామోహంతో ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి కనీసం పట్టించుకోకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా విన్నపము. ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అన్నారు. మీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నన్ను లైంగికంగా , మానసికంగా వేధిస్తున్నారు అని గత 100 రోజులు గా న్యాయం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమునకు కనబడుటలేదా? నా బాధ మీకు వినబడుట లేదా? రాష్ట్రంలో నాకు న్యాయం జరగడం లేదు అని నేను ఢిల్లీ వచ్చి గత 25 రోజులుగా నిరసన తెలియజేస్తున్నాను.
పక్క లో కి వెళ్లకపోతే వ్యాపారం చేసుకొనివ్వరు మీ బీ అర్ ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య! మాకు తెలంగాణ లో స్వేచ్ఛ హక్కు లేదా? మేము తెలంగాణ లో బిజినెస్స్ చేయకూడదా? ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా నన్ను వేధించి నా మీద తప్పుడు కేసులు పెట్టించి రిమాండ్ కి పంపి నా జీవితం ఎందుకు సర్వ నాశనం చేశారు? ఈ తప్పులకి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించి తక్షణమే చిన్నయ్య ను పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి నాకు చేయాలి. నాకు న్యాయం జరుగక పోతే ఢిల్లీ లో బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దంగా ఉన్నాను. ఈరోజు మీరు మహారాష్ట్ర నాగపూర్ లో బీఅర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా నాకు న్యాయం చేయాలి’ అని ఆమె కోరారు.
Also Read : Anni Manchi Sakunamule OTT: ‘అన్నీ మంచి శకునములే’ ఓటీటీ డేట్ ఫిక్స్
