Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
- డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా
- ప్రస్తుతం దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది
- మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రణాళికపై మరోసారి స్పందించారు. తనపై నమోదైన కేసుల్లో ఒకదానిలో మరణశిక్ష విధించినప్పటికీ.. డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి కోర్టులను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ఈ సమయంలో ప్రజల పక్కన నిలబడేందుకే స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. చట్టాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అయితే విచారణ నిష్పక్షపాతంగా జరగాలని స్పష్టం చేశారు. ముందే నిర్ణయించిన తీర్పు ఆధారంగా విచారణ కొనసాగడం న్యాయం కాదని వ్యాఖ్యానించారు. స్వదేశానికి తిరిగి వళ్తే ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని హసీనా అంగీకరించారు. అయితే భయం కారణంగా తన బాధ్యత నుంచి వెనక్కి తగ్గబోనని తెలిపారు.
దాదాపు రెండేళ్లుగా భారత్లో ఉన్న సమయంలో తన పార్టీ అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులను అధికారులు రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం లేదా బీఎన్పీతో తాను రహస్యంగా ఎలాంటి అవగాహనకు రాలేదని స్పష్టం చేశారు. తాను తిరిగి రావాలనుకోవడం అధికారాన్ని తిరిగి పొందేందుకేమీ కాదని హసీనా తెలిపారు. తన మద్దతుదారుల ప్రజాస్వామ్య, రాజకీయ హక్కులను కాపాడటం, దేశ భవిష్యత్తును బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయించుకునే అవకాశం కల్పించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు.
Also Read
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- CM Vijay: సీఎం విజయ్కు షాక్.. కాన్వాయ్లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
- Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
- India-Belgium: పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్కు బెల్జియం హామీ
ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలన్న నిర్ణయం తన మాతృదేశం పట్ల ఉన్న బాధ్యత భావన నుంచి తీసుకున్నదని హసీనా చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ నా దేశం. నా రాజకీయ జీవితమంతా బంగ్లాదేశ్ ప్రజలతోనే గడిపాను. నా తల్లి, నా సోదరులు, నా కుటుంబంలోని చాలా మంది సభ్యులు బంగ్లాదేశ్ గడ్డపైనే హత్యకు గురయ్యారు. నా రాజకీయ జీవితమంతా ఆ దేశానికి సేవ చేస్తూనే గడిపాను. నా మూలాలు అక్కడే ఉన్నాయి. నా ప్రజలు అక్కడే ఉన్నారు. నా బాధ్యత కూడా అక్కడే ఉంది’’ అని ఆమె గుర్తు చేశారు. తాను ఎదుర్కొన్న జైలు జీవితం, వేధింపులు, హత్యాయత్నాలు, పదేపదే వచ్చిన బెదిరింపులను గుర్తుచేసుకున్న హసీనా.. దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో దూరంగా ఉండేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.
తన తిరుగు ప్రయాణం అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం కాదని, తన బాధ్యతను నెరవేర్చడం, ప్రజలతో నిలబడటం, చట్టాన్ని ఎదుర్కోవడం, తనపై తీర్పును బంగ్లాదేశ్ ప్రజలకే వదిలేయడమేనని హసీనా తెలిపారు. తనను బంగ్లాదేశ్కు అప్పగించే విషయంలో భారత ప్రభుత్వం వైఖరిపై తాను వ్యాఖ్యానించబోనని హసీనా చెప్పారు. ‘‘భారత్ సార్వభౌమ దేశం. భారత ప్రభుత్వం తరఫున నేను మాట్లాడను. నా అవగాహన ప్రకారం.. భారత్ అప్పగింత అంశాన్ని చట్టపరమైన వ్యవహారంగా చూస్తోంది. తన సొంత న్యాయ, న్యాయవ్యవస్థ ప్రక్రియల ద్వారా దీనిని పరిష్కరిస్తోంది. దాన్ని భారత్ చూసుకుంటుంది’’ అని అన్నారు. భారత్-బంగ్లాదేశ్ స్నేహ సంబంధాలకు తాను ఎప్పుడూ విలువ ఇస్తానని చెప్పారు.
తిరిగి వస్తే ప్రాణహాని ముప్పు?
బంగ్లాదేశ్కు తిరిగి రావడంలో ఉన్న ప్రమాదాలను హసీనా అంగీకరించారు. అయితే భయం తన బాధ్యతను నిర్ణయించలేదని చెప్పారు. తనపై 19 సార్లు హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల హత్యలను గుర్తుచేసిన హసీనా.. 2004 ఆగస్టులో జరిగిన గ్రెనేడ్ దాడి తనను, అవామీ లీగ్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నదని పేర్కొన్నారు. ‘‘నేను జైలు జీవితం, సైనిక పాలన, రాజకీయ వేధింపులు, పదేపదే వచ్చిన బెదిరింపులను ఎదుర్కొన్నాను. కాబట్టి ప్రమాదం ఏంటో నాకు తెలుసు. కానీ రాజకీయ జీవితంలో వ్యక్తిగత భద్రత ఒక్కటే పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. నా ప్రజలకు దూరంగా జీవించడం కంటే.. నా దేశానికి తిరిగి వెళ్లి ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికే నేను సిద్ధంగా ఉన్నాను’’ అని హసీనా అన్నారు.
మరణశిక్షపై హసీనా ఏమన్నారు?
తనపై నమోదైన కేసుల్లో ఒకదానిలో విధించిన మరణశిక్షపైనా హసీనా స్పందించారు. తన ప్రాణం గురించి తాను ఆందోళన చెందడం లేదని, అయితే న్యాయ వ్యవస్థ క్షీణిస్తోందన్నదే తన ఆందోళన అని చెప్పారు. కోర్టులు, చట్టాలు, ప్రభుత్వ సంస్థలను రాజకీయ ప్రతీకారం కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ‘‘రాజకీయ ప్రేరేపిత ప్రక్రియ ద్వారా విధించిన మరణశిక్షను సత్యంపై తుది తీర్పుగా పరిగణించలేం. సాధారణ, నిష్పక్షపాత, విశ్వసనీయ న్యాయ ప్రక్రియలో నన్ను నేను సమర్థించుకునే నిజమైన అవకాశం నాకు లభించలేదు. నిందితుడి పూర్తి భాగస్వామ్యం లేకుండా, సరైన న్యాయ రక్షణ లేకుండా, రాజకీయ ఒత్తిడిలో వెలువడిన తీర్పు న్యాయం కాదు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘నేను కోర్టు ముందు హాజరయ్యే అవకాశం ఇవ్వండి. సాక్ష్యాలను సమర్పించనివ్వండి. నా న్యాయవాదులు నా తరఫున వాదించనివ్వండి. సాక్షులను ప్రశ్నించనివ్వండి. సాక్ష్యాలే మాట్లాడనివ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు.
పాలనను సమర్థించుకున్న హసీనా
తన పాలనలో సామాన్య ప్రజల సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికలు, క్రమబద్ధమైన అమలు, ఆర్థిక నిర్వహణ కారణంగా తన హయాంలో బంగ్లాదేశ్ మరింత బలమైన స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ‘‘ప్రతి పౌరుడికి విద్యుత్ అందించాం. గ్రామీణ, వెనుకబడిన ప్రజలకు ఇళ్లకు సమీపంలోనే ఉచిత వైద్యం, మందులు అందేలా కమ్యూనిటీ క్లినిక్లను విస్తరించాం. సామాజిక భద్రతా పథకాలను బలోపేతం చేశాం. భూమిలేని కుటుంబాలకు ఇళ్లు, జీవనోపాధి సహాయం అందించాం. విద్యను విస్తరించాం. మహిళా సాధికారతకు మద్దతు ఇచ్చాం. ప్రపంచంలో బంగ్లాదేశ్కు కొత్త గుర్తింపును తీసుకొచ్చాం’’ అని తెలిపారు. 2024 ఆగస్టు 5 తర్వాత బంగ్లాదేశ్లో శాంతి, భద్రత, అభివృద్ధి, ప్రజల హక్కులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రజల హక్కులను పునరుద్ధరించే విస్తృత ప్రయత్నంలో భాగంగానే తన స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు చెప్పారు.
అవామీ లీగ్పై అణచివేత ఆరోపణలు
2024 ఆగస్టు నుంచి అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు, సాధారణ మద్దతుదారులపై అరెస్టులు, తప్పుడు కేసులు, ఉద్యోగాల నుంచి తొలగింపులు, దాడులు, బెదిరింపులు, హింస చోటుచేసుకున్నాయని హసీనా ఆరోపించారు. చాలామంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చిందని, మరికొందరు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వారిని నేరస్థులుగా కాకుండా రాజకీయ వేధింపులకు గురైన బాధితులుగా చూడాలని ఆమె అన్నారు. లక్షలాది మంది అవామీ లీగ్ మద్దతుదారులు, సాధారణ పౌరులు తమ సొంత దేశంలోనే తమకు ఎలాంటి చట్టబద్ధమైన స్థానం లేనట్లుగా వ్యవహరించబడుతున్నారని ఆరోపించారు. అయితే అవామీ లీగ్ బంగ్లాదేశ్ను, ఆ దేశ ప్రజలను వదిలిపెట్టబోదని ఆమె స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
-
Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
-
CM Vijay: సీఎం విజయ్కు షాక్.. కాన్వాయ్లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!