Shashi Tharoor: కేరళం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల ముందు రాజకీయ వర్గాల్లో ఓ ప్రశ్న విపరీతంగా వినిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలోకి వస్తే, శశి థరూర్ ముఖ్యమంత్రి అవుతారా? అందరిలో ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు థరూర్ చాలా చాకచక్యంగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానా లేదా అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని తేల్చి చెప్పారు. తనను ఈ ప్రశ్నతో ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించిన థరూర్, కాంగ్రెస్ పార్టీలో ఓ నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుందని గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, పార్టీ అధ్యక్షుడి ప్రతినిధి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని, ఆ తర్వాతే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో పార్టీకి ఎటువంటి పరిమితులు ఉండవని, ఎవరినైనా ఎంపిక చేసే అధికారం అధిష్టానానికి ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు, కేరళంలో కాంగ్రెస్ విజయంపై థరూర్ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత యూడీఎఫ్ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోబోతోందని, 140 స్థానాలున్న అసెంబ్లీలో తమ కూటమి 75 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా యూడీఎఫ్కే మొగ్గు చూపుతుండటంతో ఎల్డిఎఫ్ (LDF) ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, దేశంలో ఎక్కడా వామపక్ష ప్రభుత్వం అధికారంలో లేని పరిస్థితి వస్తుందని, ఇది జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామమని ఆయన విశ్లేషించారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై థరూర్ కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. సర్వేలు ఎప్పుడూ పూర్తి చిత్రాన్ని ప్రతిబింబించలేవని, కుల, ప్రాంతీయ, వర్గ సమీకరణాలను అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఒక సర్వేలో 60 శాతం మంది అసలు సమాధానమే ఇవ్వలేదని, అటువంటప్పుడు ఆ సర్వేలకు ఎంత విలువ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీకి పోలింగ్ జరగగా, మే 4న వెలువడే ఫలితాలు థరూర్ రాజకీయ భవిష్యత్తును, కేరళం భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై థరూర్ మౌనం వహించినా, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఈ చర్చ మళ్లీ మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
