Shamshabad Road Accident: శంషాబాద్ మండలంలోని పాలమాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి సమీపంలోని కల్వర్టును బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాద ధాటికి ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జు కాగా, అందులోని నలుగురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మెట్టుగడ్డ తండా (చౌడూర్ గ్రామం) నివాసులుగా అధికారులు గుర్తించారు.
మృతులు ఎస్టీ (లంబడ) సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త కేతవత్ లింబ్య (54, తండ్రి: తవోరియా), ఆయన భార్య కేతవత్ జమున (45, గృహిణి), వారి బంధువులైన వ్యాపారవేత్తలు కత్రావత్ మాన్సింగ్ (48, తండ్రి: దాద్రా), కేతవత్ వాస్రం (45, తండ్రి: లింబ్య)గా పోలీసులు గుర్తించారు. వీరంతా TS 07GZ 9333 నెంబరు గల వాహనంలో స్వగ్రామం నుంచి శంషాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అశోక్ తీవ్రంగా గాయపడటంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి పంపించారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో మెట్టుగడ్డ తండాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

