Hyderabad: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లుఫ్తాన్సాకు చెందిన ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. శంషాబాద్ చేరుకునేలోగా విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపు మెసేజ్ పంపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది, భద్రతా విభాగాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. మెయిల్ సోర్స్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఇదేం మొదటి సారి కాదు.. అనేక సార్లు మెయిల్స్ వచ్చాయి. గత నెల 26న సైతం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్కు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు టెర్మినల్ అంతటా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ తనిఖీల తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇది ఫేక్ ఈ -మెయిల్ అని నిర్ధారించారు. తనిఖీల సమయంలో కాసేపు విమానాశ్రయంలో భద్రతా జాగ్రత్తలు చేపట్టినప్పటికీ, సాధారణ విమాన సేవలకు పెద్ద అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. ఇది ఫేక్ ఈ -మెయిల్ అని తేలడంతో విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
