Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!

  • రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు
  • మక్కాలో మూడు దేశాలు సమావేశం
  • సమష్టి భద్రతను బలోపేతం కోసమే ఒప్పందం
Defence Agreement

Defence Agreement

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలు సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. శుక్రవారం మక్కాలో జరిగిన కార్యక్రమంలో మూడు దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం, గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడుల నేపథ్యంలో తమ సమష్టి భద్రతను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

ఈ ఒప్పందానికి ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’గా పేరు పెట్టారు. అయితే ఒప్పందంలో మూడు దేశాలు ఎలాంటి నిర్దిష్ట బాధ్యతలు లేదా కట్టుబాట్లను స్వీకరించాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం బయటకు రాలేదు. అయితే శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ఈ ఒప్పందం ద్వారా మూడు దేశాల సమష్టి భద్రతను బలోపేతం చేయడం, ప్రాంతీయంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత, సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

అయితే మధ్యప్రాచ్యంలో విస్తృత స్థాయిలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఎగుమతి దేశాలపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ తమ భద్రతా సహకారాన్ని మరింత పెంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందంతో మూడు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వం కోసం సమష్టిగా పనిచేయడానికి ఈ ఒప్పందం ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇక ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.