Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యతాలకుంట గ్రామంలో సీతారామ టన్నెల్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై విశేషాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని, తాను రాజకీయ చైతన్యం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్య కోసం పిల్లలు స్కూల్స్కు సులభంగా వెళ్లగలిగే పరిస్థితి రావడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. “ప్రతి రైతు ఆనందంగా ఉండాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు వెంటనే స్పందించాలి” అని సూచించారు. అలాగే, “రైతు భరోసా పథకం కింద ఈ నెలాఖరు వరకు రూ.10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాం” అని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం అని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బేతుపల్లి, లంకాసాగర్ ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు చేరనున్నాయి. అలాగే, శ్రీరామ చంద్రుని కృపతో కొద్ది నెలల్లోనే గోదావరి జలాలను సాగు కోసం వినియోగించగలమని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలకు నమ్మకం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని మంత్రి అభిప్రాయపడ్డారు. సత్తుపల్లిలో ఎలాంటి సమస్యలు లేవని, స్థానిక ఎమ్మెల్యే రాగమయి ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “పంటలు లాభసాటిగా ఉండేలా హార్టికల్చర్ను ప్రోత్సహించాలి. హార్టికల్చర్ చేయలేని స్థితిలో ఉంటే వరి పండించండి” అని సూచించారు. ఫామాయిల్ ధర గతంలో రూ.1200గా ఉండేదని, ప్రస్తుతం అది రూ.20,800కి పెరిగిందని తెలిపారు. అలాగే, ఉగాది నాటికి ఖమ్మం జిల్లాలోని కల్లూరు గూడెంలో ఫామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
ఖమ్మం నుంచి రాజమండ్రికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం ఆగస్టు 15నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనితో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని, వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. “నా మొట్ట మొదటి కోరిక సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ సహకారంతో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి, రైతులకు నీటిని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి అభివృద్ధిలో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా