ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లోనూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, రెండో మ్యాచ్లో సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తుది జట్టులో ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గేలకు మాత్రమే చోటు దక్కింది.
సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మంజ్రేకర్ స్పందిస్తూ, ఇది సరైన క్రికెటింగ్ నిర్ణయం కాదని విమర్శించారు. సూర్యవంశీని జట్టులోకి ఎలా సరిపెట్టవచ్చో ఆయన ఒక మార్గాన్ని సూచించారు. “మొదటి మ్యాచ్లో భారత మిడిలార్డర్ పూర్తిగా కుప్పకూలింది. ఓపెనర్లు మాత్రమే రాణిస్తే సరిపోదు, మిడిలార్డర్లో నిలకడైన బ్యాటర్ అవసరం ఉంది. సూర్యవంశీని జట్టులోకి తీసుకుని అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ పంపించి, సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ను మిడిలార్డర్లో ఆడించి ఉంటే బాగుండేది. నేను ఈ నిర్ణయంతో ఏమాత్రం సంతోషంగా లేను. సూర్యవంశీ ఇన్నింగ్స్ ఓపెన్ చేయాలని నేను కోరుకున్నాను” అని మంజ్రేకర్ స్పష్టం చేశారు.
మొదటి టీ20లో భారత జట్టు 182 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. సంజు శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించినప్పటికీ ఇతర బ్యాటర్ల నుండి సహకారం లభించలేదు. ఐర్లాండ్ డెబ్యూ బౌలర్లు జై ముంద్రా, మాట్ హాలార్డ్లు భారత టాప్ ఆర్డర్ను దెబ్బతీశారు. ఏ ఫార్మాట్లోనైనా భారత్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ను బలోపేతం చేయాల్సింది పోయి, సూర్యవంశీని మళ్లీ బెంచ్కే పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. రెండో మ్యాచ్ లో కూడా ఓపెనర్లు డకౌట్ గా వెనుదిరిగారు.. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్లు పోయి.. కష్టాల్లో ఉంది.

