NTR District: ఎన్టీఆర్ జిల్లాలో ఆగని ఇసుక మాఫియా ఆగడాలు!

  • ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు
  • మాఫీయాను అడ్డుకున్న రైతులు
  • విచారణ చేపట్టిన పోలీసులు
Sand Mafia In Ntr District

Sand Mafia In Ntr District

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి.

అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న లారీలను రైతులు అడ్డుకున్నారు. లారీల వెనకాల కేశినేని అని రాసున్న స్టిక్కర్లు కనిపించాయి. నదిలో ఎస్కువేటర్ల సహాయంతో ఇసుకను లోడింగ్ చేస్తుండగా.. రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. వరదలు వస్తే తమ పొలాలు కోతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లారీలలో ఇసుకను లోడింగ్ చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. నదుల్లో ఎస్కవేటర్లతో కాకుండా మనుషులతోటే లోడింగ్ చేయాలని ఉన్నప్పటికీ ఇసుక అక్రమార్కులు పట్టించుకోవడం లేదన్నారు.

Also Read: Nimmala Rama Naidu: అందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు: మంత్రి నిమ్మల

ఇసుక లారీలు ర్యాంప్‌లోకి వెళ్లకుండా గ్రామస్తులు గండి కొట్టారు. పోలీసులు మూడు ఇసుక లారీలు, ఎస్కులేటర్‌లను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులకు ఇసుక తరలించుకునేందుకు అనుమతి వచ్చిందని విజయవాడకు చెందిన జగదీష్ అనే వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇసుకను ఈ చెరువు నుంచే తరలించి కోట్లు గడించారనే ఆరోపణలు ఉన్నాయి.