Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏళ్లతరబడి రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించాలని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కానీ వైసీపీపై దుష్ప్రచారం చేయడం రాజకీయ కుతంత్రలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ చట్టంపై ఏపీ బీజేపీ శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్పై బీజేపీ విధానాన్ని స్పష్టం చేయాలని కోరారు. రాజకీయ జీవితంలో ఏనాడు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే అలవాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని , ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మేనిఫెస్టోకు బీజేపీ సహకారం లేదని అన్నారు.
Read Also: AP CEO MK Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
ఎక్కడైనా కూటమిలోని అందరికి ఆమోదయోగ్యమైతేనే మేనిఫెస్టోను విడుదల చేస్తారని, అందుకు భిన్నంగా ఏపీలో పరిస్థితి ఉందని, దీనిని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి హామీలన్నీ నమ్మలేనివేనని ఆయన పేర్కొన్నారు. సూపర్-6కు అర్హత ఏమిటి అనేది చంద్రబాబు చెప్పడం లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు అంటున్నారని, అందరికీ ఇస్తారా, కొందరికి ఇస్తారా వెల్లడించాలని ఆయన కోరారు. వైసీపీ మేనిఫెస్టోలో చేయగలిగినవే పెట్టామని స్పష్టం చేశారు. కొవిడ్ సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు. ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇవ్వడం చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఆయన విమర్శించారు. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ముందే చూపించారన్నారు. అబద్దాలతో మోసం చేసే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గుర్తు చేశారు . రాష్ట్రంలో పింఛన్దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చంద్రబాబు కారకుడని విమర్శించారు. చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు.