Saharsa Passenger Train Fire: బీహార్లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు (నంబర్: 63344)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. దీనితో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊపిరిపీల్చుకున్నారు.
సోమవారం ఉదయం సుమారు 3:40 గంటలకు సమస్తిపూర్ నుంచి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్-2 వద్ద ఆగింది. ఈ సమయంలో ఇంజిన్కు ఆనుకుని ఉన్న బోగీలోని బ్యాటరీ బాక్స్ సమీపంలో పొగ రావడం మొదలైంది. మొదట్లో దీనిని సాధారణ సాంకేతిక లోపంగా అనుకున్నప్పటికీ, కొద్ది నిమిషాల్లోనే అది భారీ మంటగా మారి మొత్తం బోగీని ఆహుతి చేసింది. దీంతో ఒక బోగీ పూర్తిగా దగ్ధమైంది.
ఘటన సమయంలో రైల్వే అధికారులు స్టేషన్లో అత్యవసర ప్రకటనలు చేసి ప్రయాణికులను వెంటనే రైలు నుంచి దిగాలని సూచించారు. ఆ తర్వాత RPF, GRP పోలీసులు, రైల్వే సిబ్బంది కలిసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన తర్వాత అగ్నిని పూర్తిగా అదుపు చేయగలిగారు. వేగంగా చేపట్టిన సహాయక చర్యలతో పెను ప్రమాదం తప్పింది.
ఈ అగ్నిప్రమాదం కారణంగా సహర్సా-సమస్తిపూర్ రైల్వే మార్గంలో సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లను మధ్యలో నిలిపివేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. ప్రభావితమైన రైళ్లలో మనిహారి-జయనగర్ జానకీ ఎక్స్ప్రెస్, కోసీ ఎక్స్ప్రెస్, దేవఘర్ ప్యాసింజర్తో పాటు మరికొన్ని రైళ్లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
A fire broke out in the engine and an adjoining coach of passenger train number 63344 (Samastipur–Saharsa) at Simri Bakhtiyarpur railway station in Bihar's Saharsa around 3 am. Passengers were evacuated safely, and no casualties have been reported. pic.twitter.com/4DjCGnMrLJ
— Vani Mehrotra (@vani_mehrotra) August 3, 2026

