Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!

Sahara Desert

Sahara Desert

Niger: సహారా ఎడారి గర్భంలో దారుణమైన విషాదం చోటుచేసుకుంది. ఉత్తర నైగర్ పరిధిలోని మారుమూల ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, కనీసం 49 మంది ప్రయాణికులు తీవ్రమైన దాహంతో అల్లాడి ప్రాణాలు కోల్పోయారు. ముస్లింల పండుగ ‘ఈద్ అల్-అధా’ (బక్రీద్) వేడుకల కోసం మాలి దేశానికి వెళ్లిన నైగర్ పౌరులు, తిరిగి తమ స్వదేశానికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. నైగర్, అల్జీరియా సరిహద్దుల్లోని ప్రధాన చెక్‌పోస్టు అయిన ‘అస్సమాకా’కు పశ్చిమంగా దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రక్కు మొరాయించింది. దీంతో ప్రయాణికుల వద్ద ఉన్న తాగునీరు పూర్తిగా అయిపోయింది. అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీడైనా దొరకని మైదానం, దానికి తోడు పరిసరాల్లో ఎలాంటి నీటి వనరులు లేకపోవడంతో ఆ ప్రాంతం మృత్యుకూపంగా మారింది. ఈ నరకప్రాయమైన పరిస్థితుల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు ఎడారి గుండా కాలినడకన అస్సమాకా సరిహద్దు ప్రాంతానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

మాలిలోని ‘తల్హందెక్’ అనే పట్టణం నుంచి బయలుదేరిన ఆ లారీ, నిర్దేశిత మార్గం తప్పి ఎడారి వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వాహనం చెడిపోయిన తర్వాత డ్రైవర్, ప్రయాణికులు కలిసి కొన్ని రోజుల పాటు దానిని బాగు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఎండ తీవ్రతకు, నీరు లేక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆగిపోయిన ఆ ట్రక్కు కింద, దాని చుట్టుపక్కల డజన్ల కొద్దీ నిర్జీవ దేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసిన రెస్క్యూ టీం చలించిపోయింది. మృతులంతా నైగర్ దేశస్థులే కావడంతో, స్థానిక యంత్రాంగం అక్కడికక్కడే వారందరికీ సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. అయితే, ఈ ఘోరకలి జరిగిన ప్రాంతం నుంచి రెస్క్యూ టీం తిరిగి వస్తున్న సమయంలో మరో ప్రమాదం తృటిలో తప్పింది. బ్యాటరీ పాడైపోవడంతో గత మూడు రోజులుగా ఎడారిలో చిక్కుకుపోయిన మరో లారీని రెస్క్యూ టీం గుర్తించింది. మాలిలోని హరుబా పట్టణం నుంచి బయలుదేరిన ఆ లారీలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. తీవ్ర నిస్సహాయ స్థితిలో, అలసటతో ఉన్న ఆ ప్రయాణికులకు నైగర్ సైనికులతో కూడిన రెస్క్యూ టీం వెంటనే తాగునీరు అందించి, వాహనాన్ని రిపేర్ చేసి వారిని సురక్షితంగా పంపించింది.

×
×
Ad

ఐరోపా దేశాలకు వెళ్లాలనుకునే పశ్చిమ ఆఫ్రికా వలసదారులకు ఈ నైగర్ ఎడారి ఒక ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ప్రాణాలకే ముప్పని తెలిసినా మెరుగైన ఉపాధి, జీవితం కోసం యువత ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఈ తాజా ఘటనపై స్థానిక స్వచ్ఛంద సంస్థలు (NGO) స్పందిస్తూ.. ఇలా ఎడారి దాటేటప్పుడు జరిగే ప్రమాదాల గురించి డ్రైవర్లకు, ప్రయాణికులకు ఎన్నో ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నామని, అయినప్పటికీ లిబియా, అల్జీరియా వైపు వెళ్లే రూట్లలో ఇలాంటి విషాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. కేవలం బతుకుదెరువు కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం యువత ఇలాంటి అస్థిరమైన, ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుని బలికావాల్సి రావడం వారి దుస్థితికి అద్దం పడుతోందని అధికారులు పేర్కొన్నారు.