Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడంతో తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయంలో లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉందన్నారు. ఇది ప్రజా పాలన కాదు.. భయానక పాలన అన్నారు. పోలీస్ వ్యవస్థ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. గల్లీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని.. యంత్రాంగం అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిద్ర పోతుందా? అని ప్రశ్నించారు. నేరాల ఘటనలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. దళితులపై ఈ ప్రభుత్వం ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు.
“దళితులపై దాడులు జరుగుతున్నాయి. రోజుకు 10 హత్యాచారాలు, అనేక హత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది. ముఖ్యమంత్రి చేతిలో హోం శాఖ ఉండబట్టే.. పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆడ బిడ్డలను అసెంబ్లీకి రానివ్వని పరిస్థితి. పోక్సో కేసులో బెయిల్ వచ్చిన వ్యక్తి షా బాద్లో హత్యలకు పాల్పడ్డాడు. పోలీస్ కానిస్టేబుల్లో 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలు పూర్తి చెయ్యమని విద్యార్థులు అడిగితే.. ఎంట్రీన్ తాగి చావండని సీఎం అంటున్నాడు. అక్కలు అక్కలని జుట్టు పట్టుకొని కొట్టమని సీఎం చెప్పాడు. రాఖీ కట్టించుకున్న రెండు రోజుల్లోనే బీసీ మహిళ గొంతుపిసికాడు. మమ్మల్ని అడ్డుకున్న కానిస్టేబులకు ఎలా సన్మానం చేస్తారు. కేసీఆర్ ఇంటిపై దాడికి ఎస్కార్ట్తో ఎలా పంపిస్తారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.” అని సబితా ఇంద్రారెడ్డి మాక్ అసెంబ్లీలో ప్రశ్నించారు.
ఇక, సీఎం అభ్యర్థి స్థానంలో ఉన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. “మేము ఏం కేసులు పెట్టినట్లు సబితక్క మాట్లాడుతుంది. మొన్ననే కదా.. కేటీఆర్ హరీష్ రావుపై కేసులు పెట్టింది. తులం బంగారం అంటున్నారు.. ప్రధాని మోడీనే చెప్పారు కదా బంగారం కొనొద్దని. దొంగలు పడి బంగారం ఎత్తుకొని పోతున్నారు.. బంగారం ఇచ్చి ఏం లాభం. నా గురించి సురేఖ మాట్లాడుతుంటే.. బర్తరఫ్ చెయ్యకుండా ఎలా ఉంటా. నాకు హిట్లర్ ఆదర్శం. అలానే పాలన కొనసాగిస్తా.! నాకు తిక్కలేస్తే లోపలేయిస్తా. కేసీఆర్ ఇంటి వద్ద నిరసనకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే పర్మిషన్ ఇచ్చా.” అని వ్యంగ్యంగా సమాధానిచ్చారు.

