Russia-Ukraine War: దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. ఉక్రెయిన్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి చేరుకోవడంతో పాటు ఆరోగ్య సంక్షోభం, వలసలు భయాలను రేకెత్తిస్తుండగా.. ఈ దాడులు ఉక్రెయిన్ను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా చేసుకుని రష్యా దాడుల వల్ల దేశంలోని ఆరు మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ విద్యుత్ కోతల కారణంగా ప్రభావితమయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ అన్నారు.
ఉక్రెయిన్ బలగాలు ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకున్న తూర్పులోని కీలక నగరమైన ఖేర్సన్పై రష్యా బాంబు దాడి చేసినట్లు ఆ నగర అధికారి గలినా లుగోవా వెల్లడించారు. శత్రువుల దాడి ఫలితంగా మొత్తం 15 మంది నివాసితులు మరణించారని.. ఒక చిన్నారితో సహా 35 మంది గాయపడ్డారని ఆమె తెలిపారు. అనేక ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు. “రష్యన్ ఆక్రమణదారులు బహుళ రాకెట్ లాంచర్లతో నివాస ప్రాంతంపై కాల్పులు జరిపారు. ఒక పెద్ద భవనంలో మంటలు చెలరేగాయి” అని ఖేర్సన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ యారోవ్స్లావ్ యానుషోవిచ్ చెప్పారు. ఇతర ప్రాంతాలకు పౌరులను తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఖేర్సన్ సిటీ కౌన్సిల్ తెలిపింది. ఉక్రెయిన్ అంతటా పవర్ స్టేషన్లు, ఇతర అవస్థాపన వనరులపై దాడులు మాస్కో బలగాలు ప్రభుత్వాన్ని పడగొట్టి, కీవ్ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తర్వాత ఉక్రెయిన్ను లొంగదీసుకునేందుకు రష్యా ఈ తాజా ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం కీవ్ను సందర్శించిన బ్రిటన్ విదేశాంగ మంత్రి ఉక్రెయిన్కు కొత్త సహాయాన్ని ప్రకటించారు. ఇందులో అంబులెన్స్లు, రష్యా సైనికుల లైంగిక హింస బాధితులకు మద్దతు కూడా ఉన్నాయి.
Brazil Shootings: స్కూళ్లలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు.. ముగ్గురు మృతి
ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్లో పోరాడుతున్న సైనికుల తల్లులను కలుసుకున్నాడు. తాను వ్యక్తిగతంగా ఈ బాధను పంచుకుంటానని తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన వారికి చెప్పారు.