CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!

  • బుల్లెట్ వేగంతో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు
  • సీఎం చంద్రబాబుతో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ప్రతినిధుల భేటీ
  • బుల్లెట్ వాహన మోడళ్లను పరిశీలించిన సీఎం..
Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పించటంపై ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునిక తయారీ యూనిట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మిస్తామని అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్టు రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. త్వరలో ఫ్లైయింగ్ ఫ్లీ C6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్‌ను కూడా తీసుకురానున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఆంధ్రప్రదేశ్ లో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పాదనకు సంబంధించి చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. సౌర, పవన విద్యుత్ తో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ప్రాజెక్టుల గురించి వారికి తెలియచేశారు. అనంతరం రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రతినిధులు సీఎంకు బుల్లెట్ 350 మినియేచర్ మోడల్‌ను ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా బుల్లెట్ 350 మోటార్ సైకిళ్లకు సంబంధించిన మోడళ్లను సీఎం పరిశీలించారు. హెల్మెట్ ధరించి సీఎం బుల్లెట్ ఎక్కారు.