World Cup Team 2027: 2027 వన్డే ప్రపంచకప్కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ.. టీమిండియా కూర్పుపై ఇప్పటి నుంచే తెగ చర్చలు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ఎలా ఉండాలనే దానిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప తన అంచనా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ద్వారా ఊతప్ప తన టీంను వెల్లడించారు. ఆయన జట్టులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లను తొలి ఎంపిక ఓపెనర్లుగా పేర్కొన్నారు. వీరితో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో చోటు కల్పించారు. ఊతప్ప ఎంపికలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించడమే. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేసిన వైభవ్.. 2026 సీజన్లో 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 48.50 కాగా.. స్ట్రైక్రేట్ ఏకంగా 237.31గా ఉంది.
2026 జూలై 4న ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో వైభవ్ భారత సీనియర్ జట్టులో అరంగేట్రం చేశాడు. అయితే ఇప్పటివరకు వన్డేల్లో టీమిండియా తరఫున ఆడలేదు. అయినప్పటికీ 2027 ప్రపంచకప్ నాటికి అతడు మరింత పరిణతి సాధించి జట్టుకు ఉపయోగపడగలడనే అంచనాతో ఊతప్ప అతడిని ఎంపిక చేశారు. రాబిన్ ఊతప్ప తన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు కల్పించారు. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారా లేదా అనేది ప్రస్తుతం పెద్ద చర్చగా ఉంది. అయినప్పటికీ ఊతప్ప తన అంచనా జట్టులో ఇద్దరినీ ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్కు చోటు ఇచ్చారు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్లో అదనపు ఆప్షన్ల కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్లను ఎంపిక చేశారు.
ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాను ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఊతప్ప ఎంపిక చేశారు. స్పిన్ ఆల్రౌండింగ్ కోసం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లకు చోటు ఇచ్చారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేశారు. అయితే శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లకు ఈ 15 మంది జట్టులో చోటు దక్కలేదు. అలాగే నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఊతప్ప ఎంపికలో కనిపించలేదు.
బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు కల్పించారు. వీరితో పాటు అనూహ్యంగా భువనేశ్వర్ కుమార్ను కూడా ఊతప్ప తన జట్టులోకి తీసుకున్నారు. ఇక యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలకు ఊతప్ప 15 మంది జట్టులో చోటు ఇవ్వలేదు.
రాబిన్ ఊతప్ప ఎంపిక చేసిన 15 మంది జట్టు:
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్.

