Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!

Rohit Sharma1

Rohit Sharma1

Rohit Sharma Retirement: భారత క్రికెట్‌లో ఒక శకం ముగియనుందా? టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆదివారం ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మకు భారత్ జెర్సీలో చివరి మ్యాచ్ కాబోతోందనే వార్త ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, బలమైన యువ జట్టును తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ.. రోహిత్‌ను పక్కనపెట్టి యువ సంచలనం యశస్వి జైస్వాల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది.

టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై ఎంతగానో శ్రమించినప్పటికీ, అతని ఇటీవలి ప్రదర్శనల పట్ల సెలెక్టర్లు అస్సలు సంతృప్తిగా లేరట. గత నెలలో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన వెంటనే రోహిత్‌ను జట్టు నుంచి తప్పించాలని సెలెక్టర్లు మానసికంగా సిద్ధమయ్యారట. అయితే.. ఇక్కడే మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. చెన్నైలో జరిగిన మూడో వన్డేలో యువ ఆటగాడు జైస్వాల్‌కు అవకాశం ఇవ్వడం కోసం కాసేపు విశ్రాంతి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్‌ను కోరిందట. కానీ.. ఇందుకు రోహిత్ ఒప్పుకోలేదట. సెలక్షన్ కమిటీకి ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఆ సమయంలో విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో చివరికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి నంబర్-3 బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. జైస్వాల్‌కు చోటు కల్పించడం కోసమే గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడనేది తాజా సమాచారం.

గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించారు. అప్పటినుంచి గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ కూడా రోహిత్ ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. మిగిలిన రెండు ఫార్మాట్ల (టెస్టులు, టీ20లు) నుంచి తప్పుకున్న రోహిత్.. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతుండటంతో లయ అందుకోవడం అతనికి సవాలుగా మారింది. దీనికి తోడు అతను దేశవాళీ క్రికెట్ కూడా ఆడటం లేదు. గత సీజన్‌లో కేవలం రెండు విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, అందులో ఒకటి బలహీనమైన సిక్కిం జట్టుపైనే కావడం గమనార్హం. ఫామ్‌లోకి రావడానికి రోహిత్‌కు మరింత సమయం పడుతుందని భావిస్తున్న సెలెక్టర్లు, ఇప్పటికే తమ అభిప్రాయాన్ని అతనికి స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు రోహిత్ శర్మ, బీసీసీఐ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అంతా అనుకున్నట్లే జరిగితే, ఆదివారం లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డేనే రోహిత్ శర్మ ఆడే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.