Rohit – Hardik Fitness: అఫ్గానిస్థాన్తో జూన్ 13 నుంచి మొదలు కానున్న వన్డే సిరీస్కు ముందు భారత జట్టు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ఫిట్నెస్పై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ గాయాల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో వారి అందుబాటుపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా స్పందించారు.
ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురికాగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి (బ్యాక్ స్పాసమ్స్) సమస్యతో బాధపడ్డాడు. ఈ కారణంగా ఇద్దరూ సీజన్లో కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యారు. అయినప్పటికీ అఫ్గానిస్థాన్తో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే వారి ఎంపిక ఇప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో.. అఫ్గానిస్థాన్పై భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో సితాంశు కోటక్ మాట్లాడారు. రోహిత్, హార్దిక్లకు ఫిట్నెస్ క్లియరెన్స్ లభించిందా లేదా అన్న విషయంపై తనకు స్పష్టమైన సమాచారం లేదని, అయితే ఇద్దరూ ప్రస్తుతం బాగానే ఉన్నారని తెలిపారు.
“వారికి క్లియరెన్స్ వచ్చిందా లేదా అన్నది నాకు తెలియదు. కానీ వారు సిరీస్లో ఉంటారని నమ్ముతున్నాను. నాకు తెలిసినంతవరకు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. నియమాల ప్రకారం వారు ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది” అని కోటక్ పేర్కొన్నారు. అదేవిధంగా అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లు సోమవారం, మంగళవారం ముల్లాన్ పూర్ లో జట్టుతో కలుస్తారని కోటక్ వెల్లడించారు. అక్కడ ఫ్లడ్ లైట్ల కింద ప్రాక్టీస్ నిర్వహించిన తర్వాత జట్టు గురువారం ధర్మశాలకు ప్రయాణం కానుందని చెప్పారు.
ఇదిలా ఉండగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా ఈ గాయం అతడిని వేధించింది. దీంతో అతని స్థానంలో యశస్వి జైస్వాల్ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. ఒకవేళ రోహిత్ శర్మ సకాలంలో పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేకపోతే.. యశస్వి జైస్వాల్ లేదా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను మొదలు పెట్టనున్నారు.

