Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!

Riyan Parag

Riyan Parag

Riyan Parag: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం క్వాలిఫయర్-2తో ముగిసినా.. జట్టు యువ ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ రియాన్ పరాగ్ గర్వం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో రాజస్థాన్‌కు రెండో ఐపీఎల్ టైటిల్ అందిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. శుక్రవారం ముల్లాన్‌ పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం మరో 20 పరుగులు తక్కువ చేయడమేనని అభిప్రాయపడ్డాడు. ‘మేము చేసిన స్కోర్ పోరాడే లక్ష్యమే. కానీ ఈ వికెట్‌పై 230 నుంచి 240 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. రెండో ఇన్నింగ్స్‌కు ముందు హెవీ రోలర్ వాడడంతో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు కొంత సహకారం లభించింది. స్లోయర్ బాల్స్ బాగా పనిచేశాయి. కానీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని పరాగ్ తెలిపాడు.

×
×
Ad

చేజ్ సమయంలో ఆరంభంలో వికెట్లు తీయాల్సిన అవసరం ఉందని.. కానీ, అది జరగకపోవడంతో మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందని చెప్పాడు. ఈ సీజన్ మొదట్లో మేము ప్లేఆఫ్స్‌కు చేరుతామని చాలా మంది ఊహించలేదు. మా జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. అనుభవం తక్కువైనా వారు అద్భుతంగా పోరాడారు. భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా రాణిస్తారని పేర్కొన్నాడు.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై ప్రత్యేకంగా స్పందించిన పరాగ్.. ‘అతని గురించి చెప్పడానికి మాటలు చాలవు. కేవలం బంతిని బలంగా కొట్టడం మాత్రమే కాదు.. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కూడా అతనికి తెలుసు. ఈ మ్యాచ్‌లో ప్రతి షాట్‌ను ఎంతో లెక్కచూసుకుని ఆడాడు. అతను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. రాజస్థాన్ రాయల్స్‌కు రెండో ఐపీఎల్ టైటిల్ అందించే ఆటగాడిగా ఎదుగుతాడని నమ్ముతున్నా’ అని ప్రశంసించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా.. రవీంద్ర జడేజా 45 నాటౌట్, డోనవన్ ఫెరీరా 38 నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీశారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 104 పరుగులతో సెంచరీ సాధించగా.. సాయి సుదర్శన్ 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో వికెట్ తీశారు.