NTV Telugu Site icon

Revanth Reddy : అక్రమ సంపాదన తప్ప కార్మికుల సంక్షేమంపై కేసీఆర్‌కు శ్రద్ద లేదు

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికులే కీలకమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమ్మె సైరన్ ప్రభావంతోనే తెలంగాణ వచ్చిందని, బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసీ కార్మిక సంఘానికి హరీష్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారన్నారు. కార్మిక సంఘాలను కూడా వారి కుటుంబమే గుత్తాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కూతురే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ఆయన మండిపడ్డారు. అక్రమ సంపాదన తప్ప కార్మికుల సంక్షేమంపై కేసీఆర్ కు శ్రద్ద లేదని ఆయన ఆరోపించారు.

Also Read : Vizag Crime: విశాఖలో విషాదం.. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అలేఖ్య ఆత్మహత్య..! కారణం అదేనా..?

ఈ తొమ్మిదేళ్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్ అవిభక్త కవలలు అని, కానీ ఇప్పుడు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోడీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారని, తాడిచర్ల మైన్‌ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు? అని ఆయన ప్రశ్నించారు. తాడిచర్ల మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? అని ఆయన అన్నారు. ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్ ను ఆదానీకి అమ్మేస్తే… దానిపై కాంగ్రెస్ ఎంపీలం కొట్లాడామని, అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయిందన్నారు. ప్రతిమా శ్రీనివాస్‌కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్, మోడీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానమని, శ్రీధర్‌ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్ కు ఉన్న ఉపయోగం ఏమిటో ఆలోచించండని ఆయన అన్నారు.

Also Read : Tata Motors and Uber: టాటా మోటార్స్‌తో దేశంలోనే పెద్ద ఒప్పందం కుదుర్చుకున్న ఉబర్‌

లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని, వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణకు అదేశిస్తామన్నారు. సింగరేణిని లాభాల బాటలో పయనించేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని, ఎవరు అధికారంలో ఉంటే కార్మికుల కష్టాలు తీరుతాయో ఆలోచించండన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని, కేసీఆర్ మారడు.. ఇక ఆయన్ని మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని,
అప్పుడు తెలంగాణ కోసం పోరాడారు… ఇప్పుడు కాపాడుకోవల్సింది మీరే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.