Revanth Reddy: ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి ఎన్నికలు కాదు… రెండు పరివార్ ల మధ్య జరిగే యుద్ధం.. ఈవీఎం, ఈడీ, ఇన్ కం ట్యాక్స్, సీబీఐ, ఆదానీ, అంబానీ అంతా మోదీ పరివార్ అని ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మా పరివార్ అన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 20 మంది ఎంపీలను గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణలో కూడా17 సీట్లకు 14 సీట్లు గెలిపించుకుంటాం.. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బెంగుళూరు లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. బెంగుళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ కృషి వల్లే ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ ను మూడుసార్లు గెలిపిస్తే బెంగుళూరుకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో బెంగుళూరుకు కావాల్సిన నిధుల గురించి ఏనాడు ప్రస్తావించలేదన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం నుంచి నిధులు అడగడం లేదని మండిపడ్డారు.
కావేరీ జలాల వివాదం పరిష్కారం గురించి మాట్లాడలేదన్నారు. పల్లీ, బఠానీ తినడానికి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాలుకు పోవాల్సిన అవసరం లేదని.. బెంగుళూరు బస్టాండ్ లో కూడా దొరుకుతాయని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. పదేళ్లలో 7లక్షల 21వేల 680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నట్లు వెల్లడించారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుకు మోదీకి ఓటు వేయాలా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ.. రైతులను కాల్చి చంపినందుకు ఓటు వేయాలా? రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు సరికదా… దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మోదీ కల్పించారని దుయ్యబట్టారు.
READ NORE: SunRisers Hyderabad: టీ-20 చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డులు సాధించిన సన్రైజర్స్..
నల్లధనం వెనక్కి రప్పించి జన్ ధన్ ఖాతాల్లో రూ. 15లక్షలు వేస్తామన్నారు.. మీలో ఎవరికైనా రూ.15లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయా? అని ప్రజలను అడిగారు. నరేంద్రమోదీ అంటేనే నమ్మించి మోసం చేయడమని విమర్శించారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే ముందు యడ్యూరప్ప కుటుంబాన్ని పరిశీలించాలన్నారు. పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ.. గోపీనాథ్ ముండే ఇద్దరు కూతుర్లు ఎంపీలుగా ఉన్నరని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రి.. ఆయన కొడుకు ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. మీ పార్టీలో ఉన్నోళ్లంతా చేసేవి కుటుంబ రాజకీయాలే.. మీరా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడేది? అని విమర్శించారు. బీజేపీ నేతలు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. శాసనసభ ఎన్నికల్లో మోదీ దేవెగౌడ, ఆయన కుమారుడిని విమర్శించినట్లు గుర్తు చేశారు. మరి ఈ ఎన్నికల్లో మోదీ వారితో పొత్తు ఎలా పెట్టుకున్నారని అడిగారు.
మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటని.. అతడికి కావాల్సింది కేవలం ఎన్నికల్లో గెలవడమేనని.. కర్ణాటక ప్రజల సంక్షేమం కాదన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు ఓటు వేస్తారా? నమ్మించి మోసం చేసే నమోకు ఓటు వేస్తారో ఆలోచన చేయండని పిలుపునిచ్చారు.
గుజరాత్ కు 7 కేబినెట్ పదవులు.. యూపీకి 12 కేబినెట్ పదవులు.. కానీ 27 ఎంపీలను ఇచ్చిన కర్ణాటకకు కేవలం ఒక్క కేబినెట్ పదవి మాత్రమే ఇచ్చారన్నారు. ఇది కన్నడ ప్రజలను అవమానించడం కాదా? యూపీ, గుజరాత్ లోనే సమర్థులు ఉన్నారా? కర్ణాటక, తెలంగాణలో లేరా? అని ప్రశ్నించారు.