ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్పై క్రికెట్ అభిమానులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ అంటే చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగే పోరు, ఫోర్లు, సిక్సర్ల వర్షం, భారీ స్కోర్లు ఉంటాయని అందరూ ఆశిస్తారు. కానీ, అహ్మదాబాద్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం పూర్తిగా ఒకే వైపు మొగ్గు చూపడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
వన్ సైడ్ మ్యాచ్.. పోయిన మజా..
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత ఓవర్లలో కేవలం 155 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ ఆరంభంలోనే వరుసగా కీలక వికెట్లు కోల్పోవడంతో ఆటలో జోష్ తగ్గిపోయింది. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ, గుజరాత్ జట్టు అభిమానులు ఆశించిన భారీ స్కోరును బోర్డుపై ఉంచలేకపోయింది.
ఇక 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 3.3 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 మార్కుకు చేర్చి ఫైనల్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేశారు. పవర్ప్లే ముగిసేసరికే ఆర్సీబీ మ్యాచ్ను పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో అభిమానుల అసంతృప్తి..
ఒక ఓవర్లో 20 కి పైగా పరుగులు రావడం, చెమటలు పట్టించే ఉత్కంఠ, చివరి ఓవర్ థ్రిల్లర్ వంటి క్షణాల కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్కు ఈ వన్ సైడ్ పోరు అస్సలు నచ్చడం లేదు. “ఇదా ఐపీఎల్ ఫైనల్? కనీస పోటీ కూడా లేదు”, “ఫైనల్ మ్యాచ్ చూస్తున్న మజానే రావట్లేదు” అంటూ సోషల్ మీడియాలో (SM) నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆర్సీబీ విజయం దాదాపు ఖాయం కావడంతో, మ్యాచ్లో ఉత్కంఠ పూర్తిగా లోపించిందని క్రీడాభిమానులు పెదవి విరుస్తున్నారు.
