IPL 2026 RCB Jersey No.11: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో 2025లో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబి యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ఏడాది జరిగిన విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులను స్మరించేందుకు ఫ్రాంచైజీ ప్రత్యేక కార్యక్రమాలను తీసుకవచ్చింది. ఈ నిర్ణయం క్రీడాభిమానుల మనసులను హత్తుకునేలా ఉంది.
SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్.. ఇషాన్ కెప్టెన్సీపై కమిన్స్ నీడ.!
2025 జూన్ 4న చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఆర్సీబి (RCB) జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సమయంలో ఏర్పడిన గందరగోళం వల్ల చోటుచేసుకుంది. ఆ సందర్భంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఫ్రాంచైజీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఆ బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంటూ.. జట్టు యాజమాన్యం చనిపోయిన వారి కోసం వినూత్నంగా నివాళి అర్పించేందుకు సిద్ధమైంది.
మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్ సెషన్ సమయంలో అందరు ఆటగాళ్లు జెర్సీ నెం.11 ధరించనున్నారు. ఆ తర్వాత మ్యాచ్ లో మాత్రం వారు తమ సాధారణ జెర్సీలతోనే ఆడతారు. ఈ విషయాన్ని ఆర్సీబి సీఈఓ రాజేష్ మీనన్ వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మ్యాచ్కు ముందు జరిగే ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లంతా నంబర్ 11 జెర్సీతో కనిపిస్తారని.. అలాగే అందరూ నల్ల కళ్లద్దాలు కూడా ధరిస్తారని ఆయన అన్నారు.
వీటితోపాటు చిన్ని స్వామి స్టేడియంలో శాశ్వతంగా 11 సీట్లను కేటాయించే యోచనలో ఫ్రాంచైజీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సీట్లు ప్రాణాలు కోల్పోయిన ఆ 11 మంది అభిమానులకు అంకితం చేయనున్నారు. ఆ మరణించిన అభిమానులు ఎప్పటికీ మనతో ఉంటారు అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్యతో క్రీడల్లో విజయం మాత్రమే కాదు, అభిమానుల విలువ కూడా ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.
