18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ఇప్పటికే ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ యాజమాన్యం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతే కాకుండా.. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. మృతి చెందిన 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొంది.
READ MORE: AR Rahman : రెహమాన్ ను అభినందించిన సింగపూర్ అధ్యక్షుడు..
మరోవైపు.. బెంగళూరులో జరిగిన ఘోర తొక్కిసలాటపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిన్న మీడియా సమావేశంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ దుర్ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.