రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి టాటా గ్రూప్నకు ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ తన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్ను సరెండర్ చేయడానికి పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ అధికారికంగా తిరస్కరించింది. దీంతో ఈ దిగ్గజ కంపెనీ షేర్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్ కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట షరతులను పూర్తి చేయని కారణంగా మార్చి 2024లో టాటా సన్స్ సమర్పించిన డి-రిజిస్ట్రేషన్ అర్జీని రద్దు చేసినట్లు కంపెనీ సెక్రటరీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కు పంపిన లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల టాటా సన్స్ను ‘అప్పర్-లేయర్ ఎన్బీఎఫ్సీ’గా పరిగణించాల్సి వస్తోంది. ఈ కేటగిరీ కింద వచ్చే కంపెనీలు తప్పుకుండా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలనే నిబంధన ఉంది. ఈ పరిణామంపై ఇప్పటివరకు టాటా సన్స్ లేదా ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గతంలోనే అతిపెద్ద ఎన్బీఎఫ్సీల వర్గీకరణకు సంబంధించి పరిశ్రమ వర్గాలు కోరిన సడలింపులను ఆర్బీఐ తిరస్కరించింది. ముఖ్యంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన ఏ ఎన్బీఎఫ్సీ అయినా ఆటోమేటిక్గా ‘అప్పర్ లేయర్’ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 2025 నాటికి స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సిన 15 కంపెనీల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది.
మరోవైపు టాటా సన్స్లో నాయకత్వ మార్పులు, బోర్డు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు నడుస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. టాటా సన్స్లో సుమారు 65 శాతానికి పైగా వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ ఈ కంపెనీని మార్కెట్లో లిస్ట్ చేయడానికి సుముఖంగా లేదు. అయితే.. దాదాపు 18 శాతం వాటాతో అతిపెద్ద ప్రైవేట్ వాటాదారుగా ఉన్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మాత్రం కంపెనీని పబ్లిక్ లిస్టింగ్ చేయాలని చాలాకాలంగా పట్టుబడుతోంది.
టాటా సన్స్ కనుక షేర్ మార్కెట్లో లిస్ట్ అయితే, కంపెనీ ఆర్థిక లావాదేవీలు, మూలధన కేటాయింపులలో పారదర్శకత పెరుగుతుంది. అదే సమయంలో ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరిగి స్వల్పకాలిక లాభాలపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు టాటా గ్రూప్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

