Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం

  • మోడీ కేబినెట్ నుంచి కేంద్రమంత్రి ఔట్
  • కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజీనామా
  • వెంటనే ఆమోదించిన రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము
Ravneet Singh Bittu1

Ravneet Singh Bittu1

దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. అనూహ్యంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేయడం.. ఆమోదించడం జరిగిపోయింది. ప్రధాని మోడీ సూచన మేరకు వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రవ్‌నీత్ సింగ్ రాజీనామాను ఆమోదించారు. ఆకస్మిక పరిణామంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రివర్గం నుంచి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి వెంటనే రాజీనామాను ఆమోదించారు.

రాజ్యసభ ఎంపీగా ఉన్న రవ్‌నీత్ సింగ్ పదవీకాలం జూన్‌లో ముగిసింది. మరోసారి అవకాశం దక్కలేదు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంది. అయితే పంజాబ్‌లో అధికారంలోకి వచ్చేందుకు రవ్‌నీత్ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది.

పంజాబ్‌లో బీజేపీ వ్యూహంలో భాగంగానే జరిగినట్లుగా సమాచారం. ఓటర్లలోని నాలుగు వర్గాలైన హిందువులు, సిక్కులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)లపై దృష్టి పెట్టడం కోసమే ఇలానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటర్లలో సిక్కులు అతిపెద్ద వర్గంగా ఉన్నారు. జనాభాలో దాదాపు 58 శాతం మంది వీరే. ఆ తర్వాత 39 శాతంతో హిందువులు ఉన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మత సమూహంగా ఉంది. పంజాబ్‌లోని ఓటర్లలో మూడవ వర్గం దళిత సమాజం. వీరు జనాభాలో దాదాపు 32 శాతం ఉన్నారు. ఆ తర్వాత ఓబీసీలు సుమారు 16 శాతంగా అంచనా వేయబడ్డారు.