Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా అతని ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచకప్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్, ఐపీఎల్లో కూడా 11 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో టీ20 జట్టులో సూర్యకుమార్ స్థానం, అలాగే కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి టీమిండియా భవిష్యత్ టీ20 కెప్టెన్గా సంజూ శాంసన్ పేరు ప్రస్తావించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాబోయే రెండేళ్లలో సూర్యకుమార్ ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీ భవిష్యత్తు నిర్ణయమవుతుందని అన్నారు. అయితే సంజూ శాంసన్ మాత్రం నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. 2028 టీ20 ప్రపంచకప్ సమయానికి భారత్ కొత్త కెప్టెన్ కోసం చూడవచ్చు. అది సూర్యకుమార్ వచ్చే కొన్నేళ్లలో ఎలా ఆడతాడన్నదానిపై ఆధారపడి ఉంటుంది. కానీ సంజూ శాంసన్ ఇప్పటికే తనను నాయకత్వ పాత్రకు అర్హుడిగా నిరూపించుకున్నాడని శాస్త్రి పేర్కొన్నారు.
రాజస్థాన్ రాయల్స్కు ఐపీఎల్లో ఐదు సీజన్లుగా సంజూ కెప్టెన్గా వ్యవహరించిన విషయాన్ని శాస్త్రి గుర్తు చేశారు. ముఖ్యంగా 2022 సీజన్లో జట్టును ఫైనల్కు తీసుకెళ్లడం అతని నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా భారత జట్టులో ఓపెనర్గా అతను అత్యంత విధ్వంసక బ్యాటర్గా ఎదిగాడని కొనియాడారు. టీ20 ప్రపంచకప్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వరుసగా మూడు అర్ధశతకాలు బాదిన అతను కీలక మ్యాచ్ల్లో భారత్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో అతని ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించాయి. ఐసీసీ టోర్నమెంట్లో ప్లేయర్ అఫ్ ది సిరీస్ గా కూడా ఎంపికయ్యాడు.
సంజూపై ఉన్న సందేహాలన్నింటికీ ఇప్పుడు ముగింపు పడింది. అతనిలో ప్రతిభ ఎప్పుడూ ఉండేది. కానీ దాన్ని నిలకడగా చూపించలేకపోయేవాడు. అయితే ఈ సీజన్లో అతను ఆడిన తీరు, ప్రపంచకప్లో బాధ్యత తీసుకున్న విధానం, ఇప్పుడు ఐపీఎల్లో చూపిస్తున్న పరిపక్వత చూస్తే భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలకు అతనే సరైన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను అని రవి శాస్త్రి అన్నారు.
