Rashid Latif: “భారత్ ఓడిపోతుంది.. ఇది ఫిక్స్‌”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ షాకింగ్ ప్రిడిక్షన్..

Rashid Latif1

Rashid Latif1

Rashid Latif: నేడు భారత్ vs ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ సెమీస్‌ పోరుకు ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఓ పాకిస్థాన్ వార్తా కార్యక్రమంలో మాట్లాడిన రషీద్.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడి పోతుందని, ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుందని జోష్యం చెప్పాడు. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదుసార్లు తలపడగా టీమిండియా మూడు, ఇంగ్లీష్ జట్టు రెండు సార్లు విజయం సాధించాయి. మొదటి ప్రపంచకప్‌లో భారత్ 18 పరుగుల తేడాతో గెలిచింది. అదే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 2009 టోర్నీలో భారత్ మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2012లో భారత్ 90 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. పదేళ్ల తర్వాత జరిగిన మరో పోరులో మాత్రం ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. రెండు సంవత్సరాల తరువాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈసారి పరిస్థితులు ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉంటాయని రషీద్ లతీఫ్ భావిస్తున్నాడు. “సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ గెలుస్తుంది” అని చెబుతున్నాడు. కఠిన పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మంచి అనుభవాన్ని సంపాదించారన్నాడు. “ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే చాలు. ఒక్క ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేసినా భారత్‌కు అది పెద్ద ప్రమాదమే” అని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంతకీ ఎవరు గెలుస్తారు? రషీద్ ప్రిడిక్షన్ సఫలమవుతుందా? వేచి చూద్దాం..

READ MORE: Undavalli Arun Kumar: సీఎం చంద్రబాబుకు ఉండవల్లి బహిరంగ లేఖ.. పోలవరం నిర్మాణంపై ఆందోళన..