Chand Burke: ధురంధర్: ది రివెంజ్ సినీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ నటించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ చిత్రంతో రణవీర్ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకడిగా నిలిచాడు. ధురంధర్లో ప్రతి సీన్లోనూ రణవీర్ యాక్టింగ్ అదిరిపోయింది. ఇంతలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రణవీర్కు యాక్టింగ్పై ఆసక్తి పెరగడానికి కారణం ఎవరో తెలుసా? అతడి అమ్మమ్మ నుంచి వచ్చిన వారసత్వమట. రణవీర్ తన నటన ప్రతిభను తన అమ్మమ్మ నుండే వారసత్వంగా పొందాడట.
READ MORE: Dhurandhar 2: పాకిస్థాన్లో ‘ధురంధర్’ సెగ.. ఒక్కసారిగా మొదలైన కలకలం!
రణవీర్ అమ్మమ్మ పేరు చాంద్ బర్క్. ఆమె ఒక నటి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. చాంద్కు పాకిస్థాన్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. చాంద్ బుర్క్ 1932లో పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లయల్పూర్ (ప్రస్తుతం ఫైసలాబాద్)లో జన్మించారు. ఆమె 12 మంది తోబుట్టువులలో ఒకరు. ఒక పంజాబీ క్రైస్తవ కుటుంబంలో పెరిగారు. ఆమె తాత, చౌదరి అల్లా దిట్టా క్రైస్తవ మతంలోకి మారారట. చాంద్ తండ్రి, జనాబ్ ఖైరుద్దీన్ ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూ ఉర్దూ కవిత్వం రాసేవారట. దర్శకుడు నిరంజన్ రచించిన ఒక పంజాబీ చిత్రంతో 1946లో చంద్ తన కెరీర్ను ప్రారంభించారు. ఆ సినిమా సెట్లోనే ఆమెకు, నిరంజన్కు మధ్య ప్రేమ చిగురించింది. ఆమె పంజాబీ చిత్రసీమలో ప్రముఖ తారగా ఎదిగారు. అద్భుతమైన నటనతో పాటు నృత్య నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే చంద్ బర్క్ను “పంజాబ్ నృత్య కలువ” అని పిలిచేవారు. అప్పటికే పంజాబీ చిత్రసీమలో ప్రజాదరణ పొందిన చంద్కు, రాజ్ కపూర్ బాలీవుడ్లో ఒక పెద్ద అవకాశం ఇచ్చారు. రాజ్ కపూర్ చిత్రం ‘బూట్ పాలిష్’లో నటించారు. చంద్ 1946లో ‘కహాన్ గయే’ చిత్రంతో రంగప్రవేశం చేశారు. లాహోర్లో నిర్మించిన అనేక చిత్రాలలో నటించారు. అయితే, భారతదేశం, పాకిస్థాన్ విభజన తరువాత, ఆమె ముంబైకి వచ్చారు. ఇది చాంద్ కెరీర్పై ప్రభావం చూపింది. అక్కడితో ఆమె కెరీర్ ఆగిపోయింది. ముంబైకి వచ్చిన తర్వాత సుమారు ఐదేళ్లపాటు అజ్ఞాతంలో ఉండిపోయారని చెబుతారు. చివరకు, షోమ్యాన్ రాజ్ కపూర్ ప్రతిభను గుర్తించారు. ‘బూట్ పాలిష్’ చిత్రంలో కీలక పాత్ర ఇచ్చారు. ఈ చిత్రంలోని ఆమె పాత్ర నేటికీ ప్రేక్షకులలో సజీవంగా ఉంది. చంద్ 2008 డిసెంబర్ 28న ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
READ MORE: IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
ఇక చాంద్ బర్క్ చిత్ర రచయిత-దర్శకుడు నిరంజన్ను వివాహం చేసుకున్నారు. అయితే వారు 1954లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వ్యాపారవేత్త సుందర్ సింగ్ భవనానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె టోన్యా, కుమారుడు జగ్జిత్. జగ్జిత్ నటుడు రణవీర్ సింగ్ తండ్రి. చాంద్ తన కుమారుడు నటుడు కావాలని కోరుకునే వారట. అయితే, జగ్జిత్ తన తండ్రి అడుగుజాడలను అనుసరించి వ్యాపారవేత్త అయ్యాడు. కానీ.. చాల ఏళ్ల తరువాత తన అమ్మమ్మ ఆశయాన్ని మనవడు రణవీర్ సింగ్ నెరవేర్చాడు. బాలీవుడ్లోనే టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ధురంధర్ చిత్రం రణవీర్ చరిత్రలో నిలిచిపోతుంది.
