రెండేళ్లలో నేరిడి బ్యారేజీ పూర్తి చేసి తీరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత దశాబ్దాల కలయిన నేరిడి ప్రాజెక్టు సమస్యను కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పరిష్కరించిందని, వచ్చే రెండేళ్లలో పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, ప్రాంతీయ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను కొనియాడుతూ.. ఐటీ, వ్యవసాయం, సాంకేతిక రంగాలలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లే రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందన్నారు. విజన్ స్వర్ణాంధ్ర 2047 దిశగా శ్రీకాకుళం ముందంజలో ఉందని.. పేదరిక నిర్మూలనకు చేపట్టిన పీ4 (P4) విధానంలో జిల్లా ‘ఎ’ గ్రేడ్ సాధించిందని వెల్లడించారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి, 16,000 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తుచేశారు.
అదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిపై రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేయడం తప్ప జగన్కు వేరే పనిలేదని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం కూడా లేదని ఎద్దేవా చేశారు. గతంలో ఆయన సాగించిన విధ్వంసకర పాలన వల్లే ప్రజలు ఎన్నికల్లో ఓడించారని, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

