రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ. 130 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఐదు భాషలకు సంబంధించి ఈ భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఇంతటి భారీ మొత్తం రావడం రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్కు నిదర్శనమని చెప్పొచ్చు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!
ఈ డీల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకవేళ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తే, నెట్ఫ్లిక్స్ అదనంగా మరో రూ. 20 కోట్లను బోనస్గా చెల్లించనుందట. అంటే మొత్తం డీల్ విలువ రూ. 150 కోట్లకు చేరే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ పహిల్వాన్గా, క్రికెటర్గా విభిన్నమైన షేడ్స్లో కనిపించబోతున్నారు.
