తమిళ స్టార్ నటుడు, డీఎండీకే చీఫ్ ,కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తనను ఎంతో బాధించిందని తలైవా రజనీకాంత్ తెలిపారు.శుక్రవారం ఉదయం చెన్నైలోని అన్నాసాలైలోగల ఐలాండ్ మైదానం లో కెప్టెన్కు రజినీ నివాళులర్పించారు. అనంతరం ఆయన విజయకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. విజయకాంత్ మంచి మనసున్న వ్యక్తి.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.. ‘నా ప్రియ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. విజయకాంత్ ఆరోగ్య సమస్యల నుంచి త్వరలోనే కోలుకుంటారని తాము అంతా అనుకున్నాం. అయితే ఇటీవలే డీఎండీకే మీటింగ్లో ఆయన్ని చూడగానే నాలో వున్న ఆ కాస్త ఆశ పోయింది. ఆయన బతికి ఉండి ఉంటే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకం గా వ్యవహరించేవారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసేవారు. విజయకాంత్ లాంటి మంచి మనసున్న వ్యక్తి మనకు ఎప్పటికి దొరకడు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అంటూ రజినీ తన సంతాపం వ్యక్తం చేసారు.
కాగా విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతోబాధపడుతున్నారు. గత నెల 18న కూడా జలుబు, దగ్గు,గొంతునొప్పి వంటి సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. చికిత్స తరువాత కోలుకుని డిసెంబర్ 11 న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలైనా గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో చెన్నై లోని ఆసుపత్రి లో చేర్పించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నై లోని అన్నాసాలై లోగల ఐలాండ్ మైదానం లో ఉంచారు. శుక్రవారం సాయంత్రం 4:45 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమం లో విజయకాంత్ ను కడసారి చూసేందుకు సినీ మరియు రాజకీయ ప్రముఖులు అలాగే ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు వేలాది మంది తరలివస్తున్నారు.