Rahul Gandhi: లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడికి బాధ్యతగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్సభలో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే ప్రసంగాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇస్తామని చెప్పారని, కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని అన్నారు. ప్రతిపక్ష నేతగా దేశానికి సంబంధించిన అన్ని కీలక అంశాలనున లేవనెత్తడం తన హక్కు అని, విద్యార్థులపై జరిగిన దాడి అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద యువతపైకి పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, ఒక విద్యార్థి కన్ను పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పోలీసులు మేకులు అమర్చిన లాఠీలతో దాడి చేశారని ఆరోపించారు. మహిళలు, మైనర్లపై బలప్రయోగం చేశారని ఆరోపించారు.

