Site icon NTV Telugu

MP Raghav Chadha: పార్లమెంట్‌లో రూ.19 వేల కోట్ల బ్యాంకుల గుట్టు విప్పిన ఎంపీ రాఘవ్ చద్ధా!

Raghav Chadha

Raghav Chadha

MP Raghav Chadha: భారతదేశ బ్యాంకింగ్ రంగంలో సామాన్యులపై జరుగుతున్న ఒక ‘నిశ్శబ్ద దోపిడీ’ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా పార్లమెంటు వేదికగా ఎండగట్టారు. బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహించలేదనే నెపంతో గత మూడేళ్లలో బ్యాంకులు ఏకంగా రూ.19,000 కోట్లు పెనాల్టీల రూపంలో వసూలు చేశాయని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

READ ALSO: LPG Cylinder Booking: గ్యాస్‌ సిలిండర్ల కోసం భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం.. ఇలా చేయండి..

ఎవరి జేబుల నుంచి ఈ నిధులు..
ఈ సందర్భంగా రాఘవ్ చద్ధా తన ప్రసంగంలో ఈ వసూళ్ల వెనుక ఉన్న చేదు నిజాలను వివరించారు. ఈ వేల కోట్లు బిలియనీర్ల నుంచో లేదా బడా పారిశ్రామికవేత్తల నుంచో వచ్చినవి కావని, ఇవి పూర్తిగా రైతులు, పెన్షనర్లు, రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజల కష్టార్జితమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రైవేట్ బ్యాంకులు సుమారు రూ.11,000 కోట్లు వసూలు చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) సుమారు రూ.8,000 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకులు సామాన్యుల నుంచి భారీగా పెనాల్టీలు వసూలు చేయడంలో ముందున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి.

మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు జరిమానా విధించడాన్ని రాఘవ్ చద్ధా “పేదరికంపై వేసిన పన్ను”గా అభివర్ణించారు. ఒక రైతు తన అవసరాల కోసం అకౌంట్ ఖాళీ చేసినప్పుడు లేదా ఒక పెన్షనర్ మందుల కోసం డబ్బు తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకులు సేవలు అందించాల్సింది పోయి, రివర్స్‌లో రూ.100 నుంచి రూ.500 వరకు పెనాల్టీలు వేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ, సాధారణ సేవింగ్స్ ఖాతా కలిగిన కోట్లాది మంది సామాన్యులు ఈ పెనాల్టీల భారంతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.

పెనాల్టీలు రద్దు చేయాల్సిందే..
బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చుల పేరుతో ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని, ఈ మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ (RBI)ని డిమాండ్ చేశారు. నిజమైన ఆర్థిక సమతుల్యత సాధించాలంటే పేదవారిపై ఈ భారాన్ని తొలగించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ వేదికగా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “చివరికి సామాన్యుడి బాధను వినిపించే గొంతుక పార్లమెంటులో వినిపించింది” అంటూ నెటిజన్లు రాఘవ్ చద్ధాకు మద్దతు తెలుపుతున్నారు.

READ ALSO: Sarke Chunar Song: మంగ్లీకి ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా నెటిజన్లు ఫైర్ !

Exit mobile version