Quantum Valley Foundation: అమరావతి రాజధానిలో అత్యాధునిక సాంకేతిక రంగానికి నాంది పలుకుతూ “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. సుమారు 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో రెండు వరుసల్లో మొత్తం 8 భారీ టవర్లు నిర్మించనున్నారు. వీటిలో 48 అంతస్తుల ఎత్తైన టవర్లు, అలాగే 29 అంతస్తుల భవనాలు నిర్మించబడనున్నాయి. మొత్తం కలిపి సుమారు 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇక రెండు ఎకరాల్లో G+1 నమూనాలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మించనున్నారు. ఆ భవనం సుమారు 43 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. భారీ టవర్ల నిర్మాణ బాధ్యతలను ఎల్ఎండ్టీ (L&T) సంస్థ చేపట్టనుంది. క్వాంటమ్ కంప్యూటర్ల తయారీలో ప్రముఖ సంస్థ ఐబీఎం (IBM) భాగస్వామ్యం కానుండగా.. వాటికి అవసరమైన సాఫ్ట్వేర్ను టీసీఎస్ (TCS) అందించనుంది. అమరావతిలో 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. అలాగే డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఐటీ, అధునాతన సాంకేతిక రంగాల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
